Divyang Shakti Bus Scheme: ఏపీలో( Andhra Pradesh) మరో సంక్షేమ పథకం ప్రారంభం అయ్యింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. డిసెంబర్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం లో ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ముగ్గురు నేతలు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దివ్యాంగులతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఐదు రకాల బస్సుల్లో పూర్తిగా ఉచితం..
ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో( RTC buses ) 50% రాయితీతో దివ్యాంగులకు పాసులు జారీ చేశారు. కానీ ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే విధంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లలో వీరికి ఉచిత ప్రయాణం దక్కనుంది. మొత్తం 21 క్యాటగిరిలో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులతో కలిపి 12.76 లక్షల మందికి లబ్ధి కలగనుంది. ఈ దివ్యాంగ శక్తి పథకం కోసం ఏపీ ప్రభుత్వం రూ.207 కోట్లు ఖర్చు చేయనుంది.
మిగతా బస్సుల్లో 50 శాతం రాయితీ..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే దివ్యాంగులకు జీరో ఫెర్ టికెట్ జారీ చేయనున్నారు. అలాగే నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి సర్వీసులో మాత్రం 50% రాయితీ దివ్యాంగులకు కొనసాగుతుంది. అయితే పాసుల సాయంతోనే ఈ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు కొనసాగనుంది. ఆర్టీసీ డిపోలు ఉన్నచోట ఈ పాసులను జారీ చేస్తున్నారు. కొత్త పాసుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి సదరం పత్రం అవసరం. మొబైల్ యాప్ తో పాటు మనమిత్ర ద్వారా డిజిటల్ పాస్ తీసుకోవచ్చు. దివ్యాంగులకు సహాయకులుగా వెళ్లే వారికి ఐదు రకాల బస్సుల్లో టికెట్ చార్జీలో 50% రాయితీ అందిస్తోంది ప్రభుత్వం.
