Child Comment On YS Jagan: ఏపీలో రాజకీయాలు గతి తప్పుతున్నాయి. పగ, ప్రతీకారాలను ఎక్కువగా కోరుతున్నాయి. గతంలో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏపీకి కూడా ఇది విస్తరించింది. ఏ రాష్ట్రంలో కూడా ఇంతలా పరిస్థితి ఉండదు. అన్ని పార్టీలకు సోషల్ మీడియా సైన్యాలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే మాటలు, చివరకు పిల్లలతో అనుచిత వ్యాఖ్యలు చేయించి సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. ఇక డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అదే పనిగా పిల్లలతో పాటు మహిళలతో మాట్లాడించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాయి. తాజాగా ఒక పదేళ్ల బాలుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చదువుకునే వయసులో..
పదేళ్ల బాలుడు అంటే చదువుకునే వయసు. నాలుగు నుంచి అయిదో తరగతి చదవాల్సిన బాల్యం అది. కానీ అదే నోటి నుంచి జగన్ వస్తాడు. మళ్లీ అందరికీ ఉంటుంది అని వ్యాఖ్యలు చేస్తూ బూతు అర్థం వచ్చేలా ఆ బాలుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇదేదో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేయడం లేదు. కానీ ఆ పార్టీ మరి దూకుడుగా ముందుకెళ్లి.. లేనిపోని విమర్శలను కొని తెచ్చుకుంటుంది. గతంలో కూడా పార్టీపై ఇదే ప్రభావం ఉండేది. జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఆ బాలుడు చేసిన హాట్ కామెంట్స్ ఆందోళనగా ఉన్నాయి. సింహం సింగిల్ గా వస్తుంది.. పంది గుంపుగా వస్తుంది అంటూ ఆ బాలుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాల్యంలో అవేం మాటలు..
చదువుకునే బాల్యంలో కూడా ఏపీలో రాజకీయాల కోసం మాట్లాడుతుండడం.. దానినే సోషల్ మీడియాలో హైలెట్ చేస్తుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫార్మ్ లు కనీస నిబంధనలు పాటించడం లేదు. వాస్తవానికి మైనర్ బాలురును మీడియాలో చూపించకూడదు. కానీ వారు వివాదాస్పదంగా చేసే వ్యాఖ్యలను సైతం ఇప్పుడు.. ఎటువంటి భయం లేకుండా చూపిస్తున్నారు. ఈ పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ తరహా వాతావరణం ఎక్కువగా ఉంది. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం చేకూరుస్తోంది. ఎందుకంటే పాఠశాలలు, విద్య, ఫలితాల వెల్లడి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం వంటి విషయాల్లో ప్రభుత్వం పై సానుకూలత కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో చదువుకునే బాలురుతో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయించడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం కూడా.