Chandrababu Pawan Kalyan Lokesh: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. పశ్చిమబెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేరుగా తలపడుతోంది అస్సాం, పశ్చిమ బెంగాల్లో.. అయితే తమిళనాడులో సైతం ఎన్డీఏ పరంగా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈ తరుణంలో తన మిత్రులను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రధానంగా ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను ప్రచారానికి పిలిచినట్లు తెలుస్తోంది. ముగ్గురికి మూడు రాష్ట్రాలు ప్రచార బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. బిజెపి పెద్దలు కోరడంతో ఈ ముగ్గురు నేతలు సమ్మతించినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ ప్రచారానికి..
ఏపీ సీఎం చంద్రబాబును( AP CM Chandrababu) పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి కేంద్ర పెద్దలు ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబుతో గతంలో మంచి సంబంధాలు ఉండేవి. ఎన్డీఏ ను విభేదించినప్పుడు చంద్రబాబు మమతా బెనర్జీతో కలిసి రాజకీయ వేదికలు పంచుకున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబును రంగంలోకి దించితే మమతా బెనర్జీని ఇరకాటంలో పెట్టవచ్చని కేంద్ర పెద్దల ఆలోచన. పైగా పశ్చిమ బెంగాల్లో తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. వారిలో మెజారిటీ వర్గం చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉంటుంది. అందుకే చంద్రబాబుతో ప్రచారం చేయిస్తే వర్కౌట్ అవుతుందని కేంద్ర పెద్దల ఆలోచన. కేంద్ర పెద్దలు ఆహ్వానించేసరికి చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ప్రచారానికి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ( AP deputy CM Pawan Kalyan ) తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి రావాలని కేంద్ర పెద్దలు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆది నుంచి తమిళనాడు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. సనాతన ధర్మం నినాదం చేసేటప్పుడు ఎక్కువగా తమిళనాడు నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వారికి అంతే ధీటుగా సమాధానాలు చెప్పారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం బలంగా ఉంటుంది. సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి బలంగా వెళ్తున్న తరుణంలో.. తమిళనాడు లో ఆయన అయితే తట్టుకోగలరు అన్న నిర్ణయానికి కేంద్ర పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ముమ్మరంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
అస్సాంలో ప్రచారానికి..
ఇంకోవైపు మంత్రి నారా లోకేష్ కు( Minister Nara Lokesh) అస్సాం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కేంద్ర పెద్దలు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అక్కడ బిజెపి అధికారంలో ఉంది. మరోసారి నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అక్కడ యువ ఓటర్లు అధికం. వారిని ఆకట్టుకోవాలంటే లోకేష్ లాంటి యువనేత అవసరం. మొన్నటి ఎన్నికల్లో బీహార్లో నారా లోకేష్ ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఫలించింది. లోకేష్ పాల్గొన్న ప్రాంతాల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది. అందుకే ఇప్పుడు అస్సాంలో ఎన్నికల ప్రచారం చేయాలని బిజెపి ఆహ్వానించేసరికి లోకేష్ సమ్మతించినట్లు సమాచారం. మొత్తానికైతే ముగ్గురు నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీ కానున్నారు అన్నమాట.