Bus accidents in Telugu states causes: తెలుగు రాష్ట్రాలను( Telugu States ) బస్సు ప్రమాదాలు వీడడం లేదు. ప్రతి నెలలోనూ ఏదో ఒక ప్రమాదం కలచివేస్తూనే ఉంది. తాజాగా మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు టిప్పర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్సుతోపాటు టిప్పర్లు మంటలు చెలరేగడంతో.. 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు మరింతగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలోని జగిత్యాల నుంచి హరికృష్ణ ట్రావెల్ బస్సు నెల్లూరు జిల్లా కలికిరికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు.
పట్టని నిబంధనలు..
అయితే వరుసగా ప్రైవేటు ట్రావెల్ బస్సులు( private travel buses ) ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అవన్నీ హైదరాబాద్ నుంచి మన రాష్ట్రం మీదుగా బెంగళూరు, చెన్నైకి చేరుకునే క్రమంలో ప్రమాదానికి గురవుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల విషయంలో ఎన్ని రకాల హెచ్చరికలు వస్తున్న యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. కండిషన్ లో లేని బస్సులు, డ్రైవర్ల నిద్రమత్తు తో పాటు మద్యం మత్తుతో కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సుల పై తీవ్ర విమర్శలు వస్తున్నా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
Also Read: ఏపీలో పొలిటికల్ వియ్యాలు..
ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు..
తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవే. అక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు చాలా తక్కువ. ఫిట్నెస్ నిబంధనలు కూడా సాధారణంగానే ఉంటాయి. అందుకే ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బస్సులు తెచ్చి నడుపుతున్నారు. కనీస నిబంధనలు పాటించకపోయినా ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శ ప్రజల్లో ఉంది. అయితే ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల చలామణి అధికమైంది. మారుమూల గ్రామాల నుంచి సైతం నగరాలకు ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదు. ఈ కారణంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు తర్వాత చర్యలకు ఉపక్రమించడం లేదు. అందుకే ఈ ప్రమాదాలు నియంత్రణ లోకి రావడం లేదు.