Visakhapatnam Vijayawada metro projects:: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు( AP Metro projects ) సంబంధించి కీలక అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తూ ఆ డి పి ఆర్ లను తిప్పి పంపింది. మరోసారి ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి సర్వే చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేసి కేంద్రానికి మరోసారి నివేదిక పంపనుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు ప్లాన్ చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైల్వే ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని భావించింది. విశాఖపట్నం తో పాటు విజయవాడలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారుచేసి కేంద్రానికి పంపించింది. అయితే రెండు చోట్ల కీలక మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సూచనలు చేసింది.
విశాఖకు ప్రాధాన్యం..
ముందుగా విశాఖపట్నం( Visakhapatnam) మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. అందుకే అక్కడ కీలక మార్పులు చేసింది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి వెళ్లే మార్గంలో డబుల్ డెక్కర్ కంటే కారిడార్ నిర్మించడమే మంచిదని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి బస్టాండ్ నుంచి కాకుండా కాలేశ్వరం మార్కెట్ నుంచి అయితే బాగుంటుందని తెలిపింది. కేంద్రం నుంచి మార్పులు చేస్తూ సూచనలు రావడంతో.. ఈ తాజా ప్రతిపాదనలపై సర్వే చేయించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సర్వే బాధ్యతలను కూడా రైట్స్ సంస్థకు అప్పగించింది. 60 రోజుల్లో పూర్తిచేసి రిపోర్టు ఇవ్వనుంది రైజ్.
విభజన నాటి నుంచి..
ఏపీలో ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఇప్పటివి కాదు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలోనే మెట్రో రైలు ప్రాజెక్టుల ఏర్పాటు అనేది జరుగుతుందని ప్రచారం నడిచింది. కానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు. అయితే పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్న దృష్ట్యా విశాఖలో వీలైనంత త్వరగా మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూసేకరణ పై దృష్టి పెట్టింది. అయితే ఇప్పుడు కేంద్రం కీలక సూచనలు చేయడం విశేషం.
డబుల్ డెక్కర్ కాకుండా..
మూడు క్యారీడార్లలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్( Vishakha steel plant ) నుంచి కొమ్మాది కారిడార్ అతి ప్రధానమైనది. ఎందుకంటే దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాలను ఈ కారిడార్ కవర్ చేయనుంది. కానీ ఈ మార్గంలో డబుల్ డెక్కర్ ప్లాన్ ఉంది ఏపీ ప్రభుత్వానికి. అయితే నేషనల్ హైవేపై ఫ్లైఓవర్, దానిపై డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే నేషనల్ హైవే మధ్యలో నుంచి కారిడార్ ఏర్పాటు చేయడం మంచిదని కేంద్రం చెబుతోంది. అయితే దీని అంచనా వ్యయం కూడా పెరగనుంది. అందుకే ఇప్పుడు కేంద్రం సూచనలను పరిగణలోకి తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. అందుకు తగ్గట్టు సర్వే చేయించి మరోసారి కేంద్రానికి నివేదించనుంది.