AP Election Survey 2024: ఎన్నికల ముంగిట వైసీపీకి బిగ్ రిలీఫ్.వరుసగా వస్తున్న సర్వేల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న రిలీజ్ అయిన రైజ్ సర్వేలో తెలుగుదేశం పార్టీ కూటమికి విజయం అని తేల్చి చెప్పిన సంగతి తెలిసింది.మరోవైపు అంతకంటే ముందుగా వచ్చిన ఓ 11 సర్వేలు సైతం టిడిపి కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం మేనిఫెస్టో ప్రకటించి దూకుడు మీద ఉన్న టిడిపి కూటమి ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో వైసిపి కి ఓటమి తప్పదు అన్న అంచనాలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఓ సర్వే వైసిపికి అనుకూలంగా వచ్చింది. ఆ పార్టీ శ్రేణులకు ఊపిరి ఊదింది.
ఏపీలో యుడిఎస్ పోల్ సంస్థ సర్వే చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టినట్లు స్పష్టం చేసింది. సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. వైసిపి 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందుతుందని.. కూటమి 40 స్థానాలకు పరిమితం కానుందని సర్వే తేల్చి చెప్పడం విశేషం. అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 22 సీట్లు వైసిపికి దక్కనున్నాయని ఈ సర్వే తేల్చింది. ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ ఏకపక్ష విజయం సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
2019 ఎన్నికల కంటే వైసీపీ ఓటింగ్ శాతం పెంచుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. ఆ పార్టీకి 50.4% ఓట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. టిడిపి కూటమికి 44, కాంగ్రెస్ కూటమికి 2.5, ఇతరులకు 4% ఓట్లు దక్కుతాయని ఈ సర్వే స్పష్టం చేసింది. అయితే ఇక్కడే అనుమానాలకు తావిస్తోంది. అధికార వైసిపి ఒక పక్షంగా ఉండగా.. టిడిపి, బిజెపి, జనసేన ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. అయితే కాంగ్రెస్ కూటమికి కాదని ఇతరులకు అధికంగా ఓట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చి చెబుతుండడం విశేషం. అయితే పోలింగ్ ముంగిట ప్రకటించిన ఈ సర్వే వైసీపీలో ఆశలు పెంచుతోంది.