AP Election Results 2024 : ఏపీలో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఉదయం 8:30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఐదు లక్షల వరకు నమోదు కావడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేని చోట్ల ముందుగా ఈవీఎంల కౌంటింగ్ ను ప్రారంభించనున్నారు. అయితే ఓట్లు బట్టి తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఓట్లు నమోదైన చోట తుది ఫలితం సాయంత్రానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో తొలి ఫలితం నరసాపురం నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. కోవూరు, రాజమండ్రి నియోజకవర్గాల తుది ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 13 రౌండ్లలో ఫలితం తేల్చనున్నారు. తక్కువ ఓట్లు ఉండడమే అందుకు కారణం.అయితే కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓటింగ్ శాతం ఉంది. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల్లో 27 రౌండ్లు ఉంటాయని తెలుస్తోంది. అక్కడ ఫలితం వచ్చేసరికి సాయంత్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తామని.. అవి పూర్తయితేనే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం చేస్తామని చెప్పారు.
పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అమలాపురం లోక్సభ స్థానంలో 27 రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు గంటల లోపే ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. 60 నియోజకవర్గాల్లో 9, 10 గంటల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. హోరాహోరీ ఫైట్ ఉన్నచోట మధ్యాహ్నం తర్వాతే క్లారిటీ రానుంది. అయితే ఈసారి ఓటింగ్ శాతం 82 కు పెరగడం.. తప్పకుండా కౌంటింగ్ పై ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆలస్యమైతే… ఈవీఎంల కౌంటింగ్ సైతం మరింత ఆలస్యం అయ్యే పరిస్థితిలయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.