AP Assembly Election Results 2024: ఏపీ రాజకీయాల్లో ఈసారి వైయస్ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. కడప అంటే వైయస్సార్.. వైయస్సార్ అంటే కడప అన్న రేంజ్ లో పరిస్థితి ఉండేది. గత నాలుగు దశాబ్దాలుగా ఆ జిల్లాపై వైయస్ కుటుంబ ప్రభావం ఉండేది. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ సైతం తనదైన ముద్ర చూపించగలిగారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీకి అద్భుత విజయం దక్కింది ఆ జిల్లాలో. అటువంటిది ఈసారి ఇంటి పోరుతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం, వివేకా హత్య కేసు హైలెట్ చేయడం వంటి కారణాలతో వైసిపికి దెబ్బ తగిలింది. అయితే షర్మిల కడపలో మూడో స్థానంలో నిలిచిపోయారు. అటు అవినాష్ రెడ్డి సైతం 60 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. భౌతికంగా గెలిచినా అక్కడ నైతికంగా మాత్రం కూటమి గెలిచినట్టే.
కాంగ్రెస్ పార్టీ పరంగా షర్మిల సీట్లు సాధించకపోవచ్చు కానీ.. అన్నను డామేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అన్నను విభేదించి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించారు షర్మిల. అక్కడ రాణించలేకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కంటే జగన్ పార్టీ డామేజ్ని ఎక్కువ కోరుకున్నారు. తద్వారా దూకుడు ప్రదర్శించి విజయం అందుకోవాలని భావించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఎలాగైనా గెలుపొందుతానని ఆశలు పెట్టుకున్నారు. అయితే నిన్నటి ఫలితాల్లో గట్టి పోటీ ఇస్తారని భావించిన షర్మిల మూడో స్థానానికి పరిమితం అయ్యారు.కానీ 1,35,737 ఓట్లు దక్కించుకున్నారు.కానీ గెలుపు బాట పట్టకపోవడం ఆమెకు లోటు. అయితే జిల్లాలో అన్నను మాత్రం దారుణంగా దెబ్బతీయగలిగారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డారు
సొంత జిల్లాలో జగన్ దారుణంగా దెబ్బతిన్నారు. పులివెందులలో సైతం ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గింది. లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన జగన్. 61,687 ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. గత ఎన్నికల్లో 90 వేలకు పైగా మెజారిటీ సాధించారు జగన్. ఈసారి 30,000 ఓట్లు తగ్గాయి. అటు కడప జిల్లా వ్యాప్తంగా ఏడు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం మూడు చోట్ల మాత్రమే వైసిపి గట్టెక్కగలిగింది. మొత్తానికి అటు సోదరి షర్మిల ఓడిపోయారు. ఇటు జగన్ వ్యక్తిగతంగా గెలిచిన పార్టీ అధినేతగా ఓడిపోయారు. వైయస్ కుటుంబానికి ఉన్న ట్రాక్ రికార్డును ఇద్దరూ చెరిపేశారు. దీంతో సగటు వైయస్సార్ అభిమానులు బాధపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More