Annamalai Rajya Sabha news: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్షణంలోనైనా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.. జూన్లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు మొదలు పెట్టింది. అయితే ఈసారి ఏపీ నుంచి బిజెపికి ఒక రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఆ అవకాశం రాగా కృష్ణయ్య ద్వారా ఆ పదవిని భర్తీచేసింది బిజెపి. అయితే ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర రాష్ట్రానికి చెందిన నేతకు ఏపీ నుంచి బిజెపి రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ పదవుల్లో.. మూడింటిని టిడిపి ఉంచుకోనుందట. మిగతా ఒక్క పదవిని బిజెపికి కానీ.. జనసేనకు కానీ విడిచిపెట్టే అవకాశం ఉంది. అయితే బిజెపి మరోసారి ఏపీ నుంచి ప్రాతినిధ్యం కోరుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
ఆశావహులు అధికం..
అయితే ఏపీ బీజేపీలో చాలామంది ఈ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారు. కానీ ఈ పదవిని తమిళనాడుకు చెందిన అన్నామలైకు బిజెపి హై కమాండ్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నమలై పోటీ చేయలేదు. ఆయన ఎన్నికల వ్యూహానికి పరిమితం అయ్యారు. కానీ తమిళనాడులో బిజెపి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో అన్నామలై చాన్స్ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు వినిపించాయి.
అన్నామలైకు ఛాన్స్..
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు నుంచి అన్నామలైకు రాజ్యసభకు చాన్స్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో సనాతన ధర్మం గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు అన్నమలై. అక్కడ ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. అందుకే అన్నామలైకు రాజ్యసభ అవకాశమిచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది కేంద్ర పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశంలో బిజెపి హిందుత్వ వాదాన్ని తీసుకెళ్లాలన్నది ప్రణాళికగా సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
