Anna Canteens Latest Update: లక్షలాదిమంది అన్నార్తుల ఆకలిని తీర్చుతున్నాయి అన్న క్యాంటీన్లు. ఇప్పటివరకు నగరాలతో పాటు పట్టణాలకు పరిమితం అయిన ఈ క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 62 కొత్త అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట లో ఈరోజు మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రెండో విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 62 క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి.
* బతుకు తెరువు కోసం మారుమూల ప్రాంతాల నుంచి.. పల్లెల నుంచి నిత్యం ఎంతోమంది ఉపాధి బాట పడుతుంటారు. నగరాలతో పాటు పట్టణాల్లోకి వస్తుంటారు. వీరిలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదు అన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను ప్రారంభించింది. ఉదయం టిఫిన్ తో పాటు రెండు పూటలా భోజనం కూడా అందిస్తోంది. కేవలం ఐదు రూపాయలకు టిఫిన్ తో పాటు భోజనం అందిస్తుండడం విశేషం.
* అయితే కేవలం నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం అన్న క్యాంటీన్లను విస్తరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తున్నారు.
* 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మూసివేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది.
* తాజాగా ప్రారంభించబోయే అన్న క్యాంటీన్లతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్య 269కి పెరగనుంది.
* రోజుకు సగటున ఈ క్యాంటీన్ల ద్వారా రెండు లక్షల పదివేల మందికి భోజనాలు అందిస్తున్నారు. ఈ క్యాంటీన్ల పున ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల 80 లక్షల మంది భోజనాలు చేశారు. ఒక్కో అన్న క్యాంటీన్లో సగటున రోజుకు 1000 మందికి పైగా భోజనాలు చేస్తున్నారు. రూ.26,250 ఖర్చు అవుతోంది.
