Andhra University Centenary Celebrations: ఆంధ్రా యూనివర్సిటీ( Andhra University) వందేళ్ళ పండగ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు. ఏయూ అంటే ఒక్క విద్యాసంస్థ మాత్రమే కాదు. అది తెలుగుజాతి చరిత్రకు ఒక చిహ్నం. 1926లో ప్రారంభమైంది ఆంధ్రా యూనివర్సిటీ. వందేళ్ళ ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని సగర్వంగా నిలబడగలిగింది. ఆంధ్రుల మేధోసంపత్తికి, సంస్కృతికి ఒక కేంద్రం ఏయు. శతాబ్దం కిందట ప్రారంభమైన దాని ప్రస్థానం మహావృక్షంలో విస్తరించి.. లక్షలాదిమంది విద్య కుసుమాలను జాతికి అందించింది. దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాలయంగా విరాజిల్లింది. ఈ వందేళ్ల ప్రయాణంలో ఎన్నో సత్ఫలితాలతో, కలికితురాయి అనిపించుకుంది. నిజంగా ఈ వందేళ్ల వేడుక జరుపుకోవడం ఆంధ్రా యూనివర్సిటీ మరోసారి చరిత్ర పుటల్లో ఎక్కినట్లు అయ్యింది.
* పునాది వేసిన కట్టమంచి
సీజర్ రెడ్డి.. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది కట్టమంచి రామలింగారెడ్డి( Ramalinga Reddy). ఆంధ్ర విశ్వ కళా పరిషత్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు ఆయన. తొలి వైస్ ఛాన్స్లర్గా, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మేధావి ఆయన వారసుడిగా ఈ సంస్థకు పునాదులు వేశారు. కేవలం డిగ్రీ పట్టాలను ప్రదానం చేసే కేంద్రంగా కాకుండా.. పరిశోధనలతో పాటు నూతన ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్ గా మలిచారు. ప్రపంచంలోనే ఆంధ్రా యూనివర్సిటీని అత్యుత్తమ విద్యాసంస్థగా తీర్చిదిద్దారు. 100 సంవత్సరాల చరిత్రలో ప్రపంచానికి మేధావులతో పాటు పాలకులను, శాస్త్రవేత్తలను అందించింది. ఆ రంగం ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాలకు నిపుణులను అందించిన ఘనత ఆంధ్రా యూనివర్సిటీది.
* క్రమశిక్షణకు మారుపేరు..
క్రమశిక్షణకు మారుపేరు ఆంధ్రా యూనివర్సిటీ. నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ ( sir CV Raman )నుంచి ప్రముఖ గణాంక శాస్త్రవేత్త సి ఆర్ రావు వరకు ఎందరో మహానుభావులు ఈ విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేసిన వారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ డి సుబ్బారావు, జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తమ ప్రయాణాన్ని ఇక్కడే మొదలుపెట్టారు. ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇక్కడ కేవలం విద్యకే పరిమితం కాకుండా సామాజిక మార్పునకు ఆంధ్రా విశ్వవిద్యాలయం దోహద పడింది. ఒక తరం విద్యార్థులు ఈ విద్యాసంస్థను కేవలం కాలేజీ గా కాదు.. జీవిత పాఠాలను నేర్చే ఒక గృహంగా భావిస్తారు.
* మారుతున్న కాలానికి తగ్గట్టు..
ఆంధ్రా యూనివర్సిటీ ప్రస్థానం ఎప్పుడు ఒకేలా ఉండలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంది. విదేశీ విద్యాలయాలతో ఒప్పందాలు, అత్యాధునిక ఇంక్యుబేషన్ సెంటర్లు, డిజిటల్ లెర్నింగ్ వైపు అడుగులు వేస్తూ కొత్త శతాబ్దంలోకి ప్రవేశిస్తుంది. శతాబ్ద కాలం పాటు తెలుగు నేల మేధో వికాసంలో భాగస్వామిగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ.. రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రంగా ఎదగాలని పూర్వ విద్యార్థులు భావిస్తున్నారు. ఏ యు అంటే కేవలం ఒక క్యాంపస్ కాదు. ఇది కోట్లాదిమంది కలల ప్రతిరూపంగానే భావించవచ్చు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు శతాబ్ద కాలం కావచ్చు కానీ.. దాని ప్రయాణం మాత్రం నిరంతరాయం.
