Adani Solar Power: ఏపీలో అదాని కంపెనీ( Adani Company) నుంచి సౌర విద్యుత్ కొనుగోలు ప్రారంభం అయింది. అయితే దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇదే విద్యుత్ కొనుగోలుపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు తెలిపింది. ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించింది. బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుంటే.. ఎక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నిస్తూ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ అప్పట్లో అభ్యంతరం తెలిపిన సౌర విద్యుత్ ను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయడం ప్రారంభించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనవసరంగా లేనిపోని విమర్శలు కొని తెచ్చుకుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏపీ ప్రభుత్వంపై. అధికారంలోకి వచ్చి రెండేళ్లు నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు కొనుగోలుకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
సెకి ద్వారా అమ్మకాలు..
అదాని కంపెనీకి సోలార్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు అదాని కంపెనీ నుంచి నేరుగా సోలార్ విద్యుత్తును( solar electricity) కొనుగోలు చేస్తున్నాయి. అయితే సోలార్ విద్యుత్ కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. వివిధ కంపెనీల ద్వారా కొనుగోలు చేసిన సోలార్ విద్యుత్ ను.. సెకి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానం. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అదాని సోలార్ విద్యుత్ ను సెకి ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే వాస్తవ ధర కంటే.. సోలార్ విద్యుత్తు ట్రాన్స్మిటర్ ధర అధికం అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. రాజస్థాన్ నుంచి ఈ విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉండడంతో వాస్తవ ధర కంటే దాని రవాణా, తరలింపు నాకే ఎక్కువ ఖర్చు అవుతోంది. అయినా సరే ఈ సోలార్ విద్యుత్ కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలకు 1700 కోట్ల రూపాయలు లంచం రూపంలో అదానీ సంస్థ ఇవ్వడం వల్లే జరిగింది అంటూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అంతటితో ఆగకుండా ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అనుసరిస్తూ.. సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఉత్తర్వు జారీ చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ పెద్ద మనసు!
అమెరికాలో కేసు..
అయితే ఇదే అదాని సంస్థ పై అమెరికాలోని( America) ఒక కోర్టులో కేసు నమోదయింది. వివిధ దేశాలతో పాటు అమెరికాలో నిబంధనలకు విరుద్ధంగా అదాని కంపెనీ వ్యాపారం చేస్తోందని అభిప్రాయపడింది. ఇలా వ్యాపారం చేసే క్రమంలో అక్కడి ప్రభుత్వ పెద్దలకు లంచాల రూపంలో ప్రలోభ పెడుతోందని అమెరికా కోర్టు అభిప్రాయపడింది. నిందితుడిగా చేరుస్తూ అదా నీ గ్రూపుకు నోటీసులు అందించాలని భావించింది. అయితే ఆ కేసు అలానే ఉంది. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమెరికా కోర్టులో కేసు పెండింగ్ ఉండగా తీసుకోలేక పోయింది. కూటమి ప్రభుత్వం సెకికి పలుమార్లు లేఖలు రాసింది. సోలార్ విద్యుత్ ధర కంటే.. తరలించేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందని.. వాస్తవ ధరకు అందించాలని కోరింది. గత రెండు సంవత్సరాలుగా ఇదే కాలయాపన జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా మార్చి 1 నుంచి సెకి నుంచి సోలార్ విద్యుత్తును కూటమి ప్రభుత్వం కొనుగోలు చేయడం ప్రారంభించింది. అయితే కోర్టు కేసులు పెండింగులో ఉన్న దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఒకప్పుడు తాము అభ్యంతరాలు చెప్పిన విధానాన్ని అనుసరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.