US Visa Appointments: అగ్రరాజ్యం వలసలను తగ్గిస్తోంది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వలసలను అడ్డుకునేందుకు చేయాల్సిన పనలన్నీ చేస్తోంది. తాజాగా గ్రీన్ కార్డ్ కోసం నిర్వహించే ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేసింది. ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలను కూడా రద్దు చేసింది. దీంతో భారత్తో సహా అనేక దేశాల్లో దరఖాస్తుదారులు కొత్త తేదీల కోసం వేచి చూడాల్సి వస్తోంది.
అధికారిక కారణం ఇదే..
యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం, కాన్సులర్ అధికారులకు ‘‘పబ్లిక్ ఛార్జ్’’ అసెస్మెంట్పై లోతైన శిక్షణ ఇస్తున్నారు. పబ్లిక్ ఛార్జ్ అంటే ఒక వ్యక్తి అమెరికాలో ప్రభుత్వ సహాయం మీద ఆధారపడే అవకాశం ఉందా అని అంచనా వేయడం. ఇది ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ చట్టంలో ఉన్న నిబంధన. ఇప్పుడు అధికారులు ఆర్థిక స్థితి, విద్య, నైపుణ్యాలు, కుటుంబ నేపథ్యం వంటి అంశాలను మరింత సమగ్రంగా, ఏకరీతిగా పరిశీలించేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కారణంగా అపాయింట్మెంట్లను సర్దుబాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పునఃప్రారంభ తేదీ ఇంకా స్పష్టం కాలేదు.
ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పు
గత కొన్ని నెలల్లో అమెరికా చట్టబద్ధ ఇమ్మిగ్రేషన్పై కూడా పర్యవేక్షణను పెంచింది. ఇంతకు ముందు 75 దేశాల నుంచి ఇమ్మిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేసిన విధానం ఉంది. అది ఇటీవల కోర్టు తీర్పు ద్వారా రద్దయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్త శిక్షణ రూపంలో మరో చర్య తీసుకున్నట్లు కనిపిస్తోంది. అమెరికా పబ్లిక్ రిసోర్సెస్పై భారం పడకుండా స్వయం సమృద్ధి ఉన్న దరఖాస్తుదారులను మాత్రమే అనుమతించాలని చూస్తోంది. ఇక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలు (టూరిస్ట్, స్టూడెంట్, హెచ్–1బీ వంటి వర్క్ వీసాలు) మాత్రం నిలిపివేయాలేదు. కానీ, ఇమ్మిగ్రెంట్ వీసా వర్గంలోని ఫ్యామిలీ–స్పాన్సర్డ్, ఎంప్లాయ్మెంట్–బేస్డ్ గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు ప్రధానంగా ప్రభావితమవుతున్నారు.
భారత్పై ప్రభావం ఎంత?
భారత్ ఈ నిలిపివేతలో ప్రత్యేకంగా లక్ష్యంగా లేనప్పటికీ, ప్రభావం గణనీయంగా ఉంది. భారతీయులు అమెరికా ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నారు. అమెరికన్ పౌరుల భార్య/భర్త, తల్లిదండ్రులు, పిల్లలు లేదా ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కేటగిరీల్లో దరఖాస్తు చేసుకున్నవారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూ తేదీ వచ్చినవారికి రద్దు నోటీసులు వచ్చాయి. దీంతో వివాహాలు, కుటుంబాలు మార్పిడి, ఉద్యోగాలు వదిలివేయడం, పిల్లల చదువు ప్రణాళికలు వంటివి వాయిదా పడుతున్నాయి. అప్రూవల్ అయిన తర్వాత కాన్సులర్ ప్రాసెసింగ్ కోసం వేచి ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. భారతీయులకు ఇప్పటికే ఎంప్లాయ్మెంట్–బేస్డ్ గ్రీన్ కార్డ్ క్యూలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ. తాజా నిలిపివేత ఆ ఆలస్యాన్ని మరింత పెంచుతుంది.
కొత్త తేదీలపై అనిశ్చితి..
భారత్లోని యుఎస్ కాన్సులేట్లు (న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా)లో ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలు పడ్డాయి. కొత్త తేదీలు ఎప్పుడు వస్తాయో అనిశ్చితి ఉంది. చాలా మంది వేల డాలర్లు ఖర్చు చేసి మెడికల్ ఎగ్జామ్స్, డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకున్నారు. ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నవారు నష్టపోతున్నారు. ఇప్పటికే ఉన్న బ్యాక్లాగ్తో కలిపి చూస్తే, ఒక ఇంటర్వ్యూ రద్దు కావడం మొత్తం ప్రక్రియను నెలలు లేదా సంవత్సరాలు ఆలస్యం చేయవచ్చు. డాక్యుమెంట్ వ్యాలిడిటీ, మెడికల్ ఎగ్జామ్ గడువులు, ప్రయాణ ప్రణాళికలు అన్నీ ప్రభావితమవుతాయి.
స్వయం సమృద్ధి, పబ్లిక్ రిసోర్సెస్పై భారం లేకుండా ఉండేందుకే అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ నిలిపివేసింది. భారతీయ దరఖాస్తుదారులకు ఇది అసౌకర్యం, ఆర్థిక నష్టం, కుటుంబ ప్రణాళికలకు అంతరాయం కలిగిస్తోంది. కొత్త తేదీలు, శిక్షణ పూర్తయ్యే సమయం గురించి అధికారిక సమాచారం వచ్చే వరకు అనిశ్చితి కొనసాగుతుంది. దరఖాస్తుదారులు మాత్రం దేనికైనా సిద్ధంగా ఉండాలి.