Homeఆధ్యాత్మికంPuri Jagannath Temple : పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.. ఇంతకీ అందులో ఏమున్నాయంటే..

Puri Jagannath Temple : పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.. ఇంతకీ అందులో ఏమున్నాయంటే..

 

Puri Jagannath Temple : దేశమంతా ఆసక్తి.. మీడియాలో ఒకటే చర్చ.. అందులో లెక్కకు మిక్కిలి బంగారం ఉందని.. అది కనుక బయటపడితే మన దేశం అప్పు మొత్తం తీరుతుందని.. ఆ బంగారానికి కాలనాగులు కాపలా కాస్తున్నాయని.. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్న వేళ.. ఆదివారం మధ్యాహ్నం 1:20 నిమిషాలకు ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తలుపులు అర్చకులు తెరిచారు. ఇదే విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. తలుపులు తెరిచిన సమయంలో కేవలం 11 మంది మాత్రమే ఆ గదిలోకి వెళ్లారు. ఆ గదిలోకి వెళ్ళిన వారిలో ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యుడు సీబీకే మహంతి, ఆలయ పరిపాలనాధికారి అరవింద పాడి, పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎస్ సీ పాల్, వీరితోపాటు పూరి జిల్లాకు చెందిన రాజ్య ప్రతినిధి, ఐదుగురు ఆలయ సేవాయత్ లు ఉన్నారు.

భాండాగారం తెరిచే కంటే ముందు పూజలు..

రత్న భాండాగారం తెరిచే కంటే ముందు దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో అర్చకులు శ్రీ క్షేత్రంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు జరిగించారు. అనంతరం తీర్థ బిందె, ప్రత్యేక కలశం, పూజా సామగ్రితో గుండిచా మందిరానికి అర్చకులు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పూరి జగన్నాథుడి ఆశీస్సులు, అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత అర్చకులు లోకనాథ స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ కూడా ఇదే విధంగా పూజలు జరిపారు. శ్రీ చక్రానికి రక్షణగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి ఆలయాలలో పూజలు జరిపించారు. అక్కడి నుంచి పూలమాల తీసుకొని శ్రీ చక్రం పేరుతో పిలిచే ఖజానా గది వద్దకు చేరుకున్నారు.. ఖజానా గది లో విష సర్పాలు సంచరిస్తున్నాయనే వదంతులు ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా 40 మందితో కూడిన ఓడీఆర్ఏఎఫ్ బృందాలను, స్నేక్ హెల్ప్ లైన్ భాండాగారం వెలుపల ఉంచారు. ఒకవేళ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వారి సహాయం తీసుకున్నందుకు అందుబాటులో ఉంచారు. ఈ రత్న భాండాగారాన్ని 1978 అంటే దాదాపు 46 సంవత్సరాల క్రితం తెరిచారు. బంగారం, ఇతర సంపద ఉన్న పెట్టెలు ఒకవేళ శిథిలావస్థకు చేరుకుంటే.. వాటి స్థానంలో కొత్త వాటిని మార్చేందుకు 15 బలమైన చెక్క పెట్టెలను అధికారులు సిద్ధంగా ఉంచారు. అంతకుముందే ఆ పెట్టెలను రత్న భాండాగారం గా పిలుస్తున్న గది వద్దకు తీసుకెళ్లారు. వాస్తవానికి ఈ భాండాగారం తెరిచే సమయంలో శ్రీ క్షేత్రంలో జగన్నాధుడికి మూలికా సేవలు నిర్వహించారు. స్వామి వారికి ప్రతిరోజు 119 అరుదైన మూలికలతో సేవలు నిర్వహిస్తారు. ఈ సేవలను నిర్ణీత సమయాలలో సేవా యత్ లు జరుపుతారు. భాండాగారం తెరిచే సమయంలో సేవలకు ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు సేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిపారు.

అప్పుడే విలువపై ఒక అంచనా

అదే ప్రస్తుతం లెక్కింపు జరిగిన తర్వాతే జగన్నాథ స్వామి బంగారం విలువపై ఒక అంచనా వస్తుందని తెలుస్తోంది. రత్న బాండాగారంలోని సంపాదన మొత్తం ఒకచోటకు తరలించి.. అత్యంత పటిష్ట భద్రత మధ్య లెక్కిస్తారని ప్రచారం జరుగుతుంది. స్వామివారి ఆభరణాలు లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని ఒడిశా ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ రూపంలో భద్రపరచనుంది. ఇక ప్రస్తుతం పూరీలో జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నారు. జూలై 19 వరకు జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర ఆలయం బయటే ఉంటారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం స్వామివారి ఆభరణాల లెక్కింపుకు ఇంకా ఎంత సమయం పడుతుందనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. భాండాగారానికి మరమ్మతులు కూడా చేయవలసిన అవసరం నేపథ్యంలో, ఆభరణాల లెక్కింపు కూడా నిర్వహిస్తున్న సమయంలో.. ఈ రెండు పనులు ఒకేసారి చేసేందుకు వీలు పడదా? అనే ప్రశ్నకు పూరీ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular