Graveyard Wedding: పెళ్లిళ్లు ఎక్కడ జరుగుతాయంటే.. నేటి తరం ఫంక్షన్హాళ్లు, కన్వెన్షన్లు.. హోటళ్లు.. ఓపెన్ గ్రౌండ్లో జరుగుతాయంటారు.. ఓ పది, ఇరవై ఏళ్ల క్రితం వారిని అడిగితే.. అమ్మాయి ఇంట్లో.. అబ్బాయి ఇంట్లో జరుగుతాయి.. బాగా డబ్బులు ఉంటే.. ఫంక్షన్ హాళ్లలో చేసుకుంటారు. అంటారు. ఇక పాత తరం వారిని అడిగితే.. పెళ్లిళ్లు స్వర్గంలో అవుతాయి అని చెబుతారు. అక్కడ నిశ్చయమైన పెళ్లినే.. భూమిమీద మనం చేసుకుంటాం అని చెబుతారు. ఇవన్నీ కరెక్టే.. కానీ ఇవేవీ కాకుండా ఓ కొత్త ప్లేస్లో ఓ ప్రేమపెళ్లి జరిగింది. ఆ ప్లేస్ ఏంటో తెలుసా.. శ్మశానం. ఇది ఎక్కడ జరిగింది.. ఎందుకు అలా జరిగిందో తెలుసుకుందాం..
కీలక ఘట్టం..
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే తమ వివాహ వేడుకను ఎప్పటికి గుర్తుండేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వధూవరులు ఆశపడుతుంటారు. కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటే, మరికొందరు రిచ్ ప్యాలెస్లోనో, సముద్రానికి దగ్గరగా ఇలా ఎవరి టేస్ట్కి తగ్గట్లు వాళ్లుపెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు. ఇక మధ్య తరగతి ప్రజలు అయితే.. ప్రీవెడ్డింగ్, హల్దీ, మెహందీ, పోస్ట్ వెడ్డింగ్ అని వేడుకలు చేసుకుంటున్నారు. కాస్త సంపన్నులు.. ప్రెగ్నెంట్ షూట్ కూడా చేస్తున్నారు. ఇటీవల డైవర్స్ షూట్ కూడా చేసుకుంటున్నారు. పెళ్లి అంటే ఆ వేడుకలో జరిగే ప్రతీది మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలనుకుంటున్నారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ పెళ్లి వేడుక శ్మశానంలో జరిగింది. సంప్రదాయబద్దంగా బంధువుల సమక్షంలో ఈ తంతు పూర్తయింది. పైగా ఇది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం
ఎందుకలా చేశారంటే..
శ్మశానంలో ప్రేమికుల పెళ్లి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా రహతా పట్టణానికి చెందిన గంగాధర్ గైక్వాడ్.. స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. కుటుంబంతో కలిసి ఎన్నో ఏళ్లుగా స్మశానవాటికలోనే నివాసం ఉండేవారు. ఆయనకు మయూరి అనే కూతురు ఉంది. 12 తరగతి వరకు చదువుకున్న ఆమె ఉద్యోగం కోసం షిర్డీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పని చేస్తున్న సంస్థలో మనోజ్ అనే యువకుడు ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి పరిచయం స్నేహం నుంచి ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయి. అయితే తనకు జీవనాధారాన్ని ఇచ్చిన స్మశాన వాటికలోనే కూతురి పెళ్లి చేయాలని గంగాధర్ ఎప్పట్నుంచో భావించాడట.
తండ్రి కోరిక మేరకు..
తండ్రి కోరికను మయూరి తనకు కాబోయే భర్త ద్వారా అబ్బాయి కుటుంబసభ్యులకు తెలియజేసింది. తండ్రి కోరికను కాదనలేక మయూరి పెరిగిన స్మశానంలోనే బంధువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పెళ్లిని జరిపించారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలో, వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రేట్ డాటర్.. గ్రేట్ ఫాదర్.. సూపర్.. వెల్డన్.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు నూతన జంటను ఆశీర్వదిస్తున్నారు.