Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం ఒక ఆనవాయితీ. ఆలయానికి సమీపంలోనే బద్ది పోచమ్మ ఆలయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పోచమ్మకు బోనం సమర్పిస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడికి దగ్గర్లోనే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది.
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగానే కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు ధనం రూపంలో.. ఇంకొందరు వస్తువుల రూపంలో కానుకలను ఇస్తుంటారు. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి ఓ దంపతులు ఇచ్చిన విరాళం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అంతేకాదు ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.
వేములవాడ రాజన్న ఆలయానికి ఇదే పట్టణానికి చెందిన సుభాష్ నగర్ వాస్తవ్యులు పసుల లక్ష్మీనారాయణ, జనాభాయ్ దంపతులు ఏడు లక్షల ఒక వెయ్యి 116 రూపాయలను విరాళంగా అందించారు. స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్టుకు దీనిని ఉపయోగించాలని వారు కోరారు. ఆ సమయంలో లక్ష్మీనారాయణ దంపతులకు గర్భగుడి దర్శనం కల్పించారు ఆలయ కమిటీ వారు. ఆ తర్వాత స్వామివారి శేష వస్త్రాలు.. కళ్యాణ లడ్డు వారికి అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల లక్ష్మీనారాయణ కుమార్తెలు ఆలయ నిర్వాహకుల దగ్గరికి వచ్చారు.. దర్శనం కోసమని నిర్వాహకులు అనుకున్నారు. కానీ వారు వచ్చింది దర్శనానికి కాదు..
లక్ష్మీనారాయణకు మతిస్థిమితం లేదని.. అందువల్లే ఏడు లక్షల రూపాయలను దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్టుకు అందించారని.. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రిలో చూపించాలని వారు ఆలయ అధికారులతో చెప్పారు. అంతేకాదు నిత్యాన్నదాన ట్రస్ట్ కు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఆలయ అధికారులను కోరారు. అయితే దీనిపై ఆలయ అధికారులు స్పష్టత ఇచ్చారు. నిత్య అన్నదాన ట్రస్టు మాత్రమే కాదని.. ఆలయ అభివృద్ధికి ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇవ్వడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. ఒకసారి విరాళం ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని వారు చెప్పారు. దీంతో లక్ష్మీనారాయణ కుమార్తెలు వెనుతిరి గారు. లక్ష్మీనారాయణ ఆలయానికి విరాళం ఇచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆయన కుమార్తెలు మాత్రం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే డబ్బులు ఇచ్చారని అంటున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.



