Revanth Reddy Parents Maintenance Bill 2026: సమాజంతోపాటు కుటుంబ వ్యవస్థ మారుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ పెద్ద నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు చిక్కలు తెచ్చుకుంటున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి అంటు రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగిరిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఒంటరి అవుతున్నారు. కొందరు కొడుకులు అయితే తల్లిదండ్రులును పట్టించుకోవడమే మానేస్తున్నారు. వారి ఆస్తులనే ప్రేమిస్తున్నారు. ఆస్తులు వచ్చాకా వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు, 2026’ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, వారి జీతంలో నేరుగా కోత విధించి, ఆ మొత్తాన్ని వృద్ధుల ఖాతాల్లో జమ చేసే విప్లవాత్మక నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
ఎవరికి వర్తిస్తుంది?
ఈ బిల్లు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని రకాల ఉద్యోగ వర్గాలకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందే అధికారులు, సిబ్బందికి వర్తిస్తుంది. రాష్ట్ర పరిధిలో పనిచేసే ప్రైవేటు కంపెనీలు, సంస్థల్లోని ఉద్యోగులు కూడా బిల్లు పరిధిలోకి వస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు వంటి ప్రజా ప్రతినిధులకు కూడా ఇది తప్పనిసరి.
జీతం నుంచి కోత..
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు అధికారికంగా రుజువైతే, ఉద్యోగి జీతం నుంచి నేరుగా మొత్తాన్ని మినహాయించి, వృద్ధుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. నెలవారీ జీతంలో 15 శాతం లేదా గరిష్టంగా రూ.10 వేలు ఏది ఎక్కువైతే అది కోత పెడతారు. ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, మొత్తాన్ని సమానంగా పంచుకుని వారి జీతాల నుంచి కోత విధిస్తారు.
దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లో పరిష్కారం..
వృద్ధ తల్లిదండ్రులు ఈ ప్రక్రియను సులభంగా ప్రారంభించవచ్చు. తమను పిల్లలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేస్తూ, సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. కలెక్టర్ లేదా ఆయన నియమించిన ప్రత్యేక అధికారి ఉద్యోగిని విచారణకు పిలిచి, ఇరువైపులా వాదనలు వింటారు. దరఖాస్తు స్వీకరించిన 60 రోజుల్లోపు తుది నిర్ణయం ప్రకటించి, ఆదేశాలు జారీ చేయాలి. నిర్లక్ష్యం రుజువైతే, ఉద్యోగి శాఖాపరమైన అధికారికి ఆదేశాలు జారీ చేసి, తర్వాతి జీతం నుంచే కోత ప్రారంభిస్తారు.
నేటి ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. భార్యాభర్త, పిల్లలతో కూడిన చిన్న కుటుంబాలు పెరుగుతున్నాయి. ఉపాధి నిమిత్తం యువత గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లడంతో, వృద్ధ తల్లిదండ్రులు ఒంటరితనానికి, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ బిల్లు ద్వారా పరిపాలనా స్థాయిలోనే వేగవంతమైన పరిష్కారం లభిస్తుంది.