Bride Cancels Wedding: మరి కాసేపట్లో పెళ్లి.. పెళ్లి మండపం సందడిగా ఉంది. బంధువులు భారీగా తరలివచ్చారు. బాజా భజంత్రీలతో.. అర్చకుల వేదమంత్రాలతో ఆ ప్రాంతం మొత్తం కోలాహలంగా ఉంది. పెళ్లి కుమారుడు మండపం మీదకి వచ్చాడు.. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి.. లింగాల మండలానికి చెందిన యువతికి సరిగ్గా రెండు నెలల క్రితం వివాహం ఖాయమైంది. యువతీ యువకులకు నచ్చడంతోనే రెండువైపులా కుటుంబాలు పెళ్లికి సిద్ధమయ్యాయి. నిశ్చయ తాంబూలాల వేడుక కూడా ఘనంగా జరిపారు. అప్పటినుంచి కాబోయే వధూవరులు రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు. సరిగా పెళ్లి రోజు రానే వచ్చింది.
పెళ్లి వేడుకను ఘనంగా జరపడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అక్కడి సంప్రదాయం ప్రకారం పెళ్లి కుమారుడి ఇంట్లోనే వివాహతంతు జరుగుతూ ఉంటుంది. వివాహ తంతును అత్యంత ఘనంగా జరపడానికి పెళ్లి కుమారుడి తండ్రి భారీగానే ఖర్చు పెట్టాడు. పెళ్లి మండపాన్ని అందంగా రూపొందించారు. వచ్చిన బంధువులకు అద్భుతంగా విందు పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత పెళ్లి వేదిక మీదికి పెళ్లి కుమారుడు వచ్చారు. అన్ని క్రతువులు పూర్తయిన తర్వాత.. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చారు. జీలకర్ర బెల్లం పెట్టారు. ఇద్దరి మధ్య అడ్డుతెర తొలగించారు. ఇక మరికాసేపట్లో తాళి కడతాడు అనుకుంటుండగా.. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి మారిపోయింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆ బదులు అకస్మాత్తుగా చెప్పేసింది. కుటుంబ సభ్యులు.. బంధువులు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆ వివాహం రద్దయింది. వివాహం జరపడానికి పెళ్లి కుమారుడి తండ్రి భారీగా డబ్బులు ఖర్చు పెట్టుకున్న నేపథ్యంలో.. వాటిని మొత్తం పెళ్లి కుమార్తె తండ్రి తిరిగి ఇవ్వాలని పెద్ద మనుషులు తీర్మానించారు.
ఆ పెళ్లి కుమార్తెకు అకస్మాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని చర్చ మొదలైంది. ఒకవేళ తను ఎవరితోనైనా ప్రేమలో ఉందా.. అందువల్లే ఈ వివాహాన్ని రద్దు చేసుకుందా.. అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.. తనకు ఏదైనా అనారోగ్య సమస్య ఉందేమో.. అందువల్లే వివాహాన్ని రద్దు చేసుకుందేమోనని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదని తెలుస్తోంది.