HomeతెలంగాణParty shifting impact on leaders: అప్పుడు బీటీ.. ఇప్పుడు వీబీ.. పార్టీనే నమ్ముకున్న వాళ్లకు...

Party shifting impact on leaders: అప్పుడు బీటీ.. ఇప్పుడు వీబీ.. పార్టీనే నమ్ముకున్న వాళ్లకు గుండు సున్నా

Party shifting impact on leaders: ముందు వచ్చిన చెవుల కంటే.. వెనుక వచ్చిన కొమ్ములు వాడి అంటారు. మిగతా రంగాలలో ఏమోగానీ.. రాజకీయాల్లో మాత్రం ఈ సామెత నూటికి నూరు శాతం సరిపోతుంది. అధికారంలోకి రాకముందు పార్టీలు మొత్తం ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆ అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి తాపత్రయపడతాయి. ఇందులో ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేదు.. అన్ని అలానే ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది.. అప్పుడు ఆ పార్టీకి గొప్పగా చెప్పుకునే సీట్లు రాలేదు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. టిడిపి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ వరకు అందరూ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. చివరికి కమ్యూనిస్టు పార్టీని కూడా వదిలిపెట్టలేదు. నాడు ఈ పరిణామాన్ని గులాబీ పార్టీ రాజకీయ పునరేకీకరణ అని చెప్పింది. అంతేకాదు 2018 లో జరిగిన ఎన్నికల్లోను ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది గులాబీ పార్టీ. పైగా వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది.. నాడు కూడా కేసీఆర్ దానిని రాజకీయ పునరేకికరణ అని చెప్పారు.

అప్పుడు ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరుతున్నప్పుడు.. రకరకాల విమర్శలు వచ్చాయి. నాడు అధికారం ఉంది కాబట్టి వాటిని కేసిఆర్ తొక్కిపెట్టారు. ఒరిజినల్ తెలంగాణ కాకుండా.. బంగారు తెలంగాణ బ్యాచ్ హవా పెరిగిపోయిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వాటిని కెసిఆర్ పట్టించుకోలేదు. పైగా సొంత మీడియాలో రాజకీయ పునరేకీకరణ అనే కోణంలో కథనాలు రాయించారు. అప్పట్లో కెసిఆర్ మీడియా మీద ఉక్కు పాదం మోపడంతో.. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక లేకుండా పోయింది.

2023 లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత గతంలో తనకు ఎదురైన అనుభవానికి గట్టి రివెంజ్ తీర్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే గులాబీ పార్టీలో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. దీనిని బిఆర్ఎస్ నేతలు విమర్శించారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. అనేక సందర్భాల్లో విచారణ పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లింది. స్పీకర్ ఎలాగూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి.. ఆ పార్టీకి అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా గులాబీ పార్టీ ఈ వ్యవహారంలో ఏదో చేయబోయి.. తనే విమర్శల పాలైంది.

అటు కాంగ్రెస్ పార్టీ.. ఇటు భారత రాష్ట్ర సమితి ఇప్పుడు తెలంగాణలో ఒక రకమైన ఒత్తిడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి.. భారత రాష్ట్ర సమితి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని చేర్చుకుంది. ఇది ఎల్ రమణలాంటి వాళ్లకు నచ్చడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తామని గులాబీ పార్టీ పెద్దలనుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే రమణ రాజకీయ భవిష్యత్తు మొత్తం నాశనమైనట్టే. అందువల్లే ఆయన జీవన్ రెడ్డి రాక పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా ఇదే ధోరణిలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ జీవన్ రెడ్డి కి ఒక టికెట్ ఇస్తే.. రమణ తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేరే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కేవలం జగిత్యాలలోనే కాకుండా.. ఇంకా కొన్ని నియోజకవర్గాలలో భారత రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష కు తెర లేపినట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఉన్న గులాబీ పార్టీ నేతలు అంతర్మథనంలో పడుతున్నారని.. తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా వేరే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీని కడిగిపారేస్తున్నారు. ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. తన సేవలను పార్టీ వాడుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శాసన మండలి లో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవహార శైలి సక్రమంగా లేదని.. ప్రభుత్వంలో కూడా సానుకూల దృక్పథం కనిపించడం లేదని మండిపడ్డారు. ఇంకా కొంతమంది నేతలు కూడా ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. మొత్తంగా చూస్తే అటు బిటి బ్యాచ్.. ఇటు వలస బ్యాచ్.. వల్ల రెండు ప్రధాన పార్టీలు శిరోభారాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ భారం ఎంతవరకు సాగుతుంది.. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది.. ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular