Homeఅంతర్జాతీయంArshad Nadeem : ఏటా ఒకసారి మాత్రమే ఇంట్లో మాంసాహారం.. గ్రామస్తుల చందాలతో శిక్షణ.. కన్నీళ్లు...

Arshad Nadeem : ఏటా ఒకసారి మాత్రమే ఇంట్లో మాంసాహారం.. గ్రామస్తుల చందాలతో శిక్షణ.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఒలింపిక్ గోల్డ్ మెడల్ జీవిత గాధ

Arshad Nadeem: అది కల్లోల పాకిస్తాన్. అక్కడ. మియా చాను అనే ఒక ప్రాంతం ఉంది. దానికి సమీపంలో ఖనేవాల్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ కుర్రాడు తండ్రి ఓ కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఆ కూలి కుమారుడు అద్భుతమైన శరీర సౌష్టవాన్ని కలిగి ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి వస్తువులను దూరంగా విసరడం అలవాటు. అతని అలవాటు క్రమంగా జావెలిన్ వైపు మళ్లింది. క్రమంగా అందులో రాటు తేలేలా చేసింది. అతడికి తదుపరి శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక స్తోమత లేదు. అతని పరిస్థితి చూసిన ఆ ఊరి వాళ్ళు మొత్తం చందాలు వేసుకొని ఆ కుర్రాడికి శిక్షణ ఇప్పించారు. ఆ కుర్రాడు కూడా అత్యంత నిష్టగా శిక్షణ పొందాడు. సీన్ కట్ చేస్తే ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు.. ఇంతటి ప్రయాణాల్లో అతడు కష్టాలు పడ్డాడు. కన్నీళ్లను అధిగమించాడు. నిద్ర లేని రాత్రులు గడిపాడు. సరైన తిండిలేక పస్తులు కూడా ఉన్నాడు. చివరికి కష్టేఫలి అనే సామెతను నిరూపించాడు.

అటు నుంచి ఇటువైపు వచ్చాడు

అర్షద్ నదీమ్ 1997 జనవరి రెండున జన్మించాడు. పారిస్ వేదికగా జరిగిన జావెలిన్ పోటీలలో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా మించి ఈటవిసిరి బంగారు పతకం సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించిన తొలి పాకిస్తాన్ అథ్లెట్ గా నిలిచాడు. ఈ క్రమంలో వార్తల్లో వ్యక్తిగా మారాడు. అయితే జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న ప్రధాన ప్రకారం నదీమ్ ది అత్యంత పేద కుటుంబం. నదీమ్ కుటుంబంలో మొత్తం ఏడుగురు సంతానం. అందులో నదీమ్ మూడోవాడు. చిన్నప్పటినుంచి నదీమ్ కు ఆటలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి వాటిల్లో సత్తా చాటేవాడు. జిల్లా స్థాయిలో క్రికెట్ టోర్నీలలో అద్భుతంగా రాణించేవాడు. బౌలింగ్ అంటే నదీమ్ కు చాలా ఇష్టం. అయితే అథ్లెటిక్స్ లో నదీమ్ విశేషంగా రాణించేవాడు. దానిని అతడి కోచ్ రషీద్ అహ్మద్ గుర్తించాడు. అతని పర్యవేక్షణలో నదీమ్ రాటు తేలాడు. అయితే కుటుంబ పరిస్థితి కారణంగా నదీమ్ కు సరైన ఆహారం కూడా లభించేది కాదు. ఈద్ ఆల్ అదా నాడు మాత్రమే ఆ కుటుంబం మాంసాహారం వండుకునేవారంటే నదీమ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పంజాబ్ యూత్ ఫెస్టివల్స్, ఇంటర్ బోర్డు మీట్ లో జావెలిన్ విభాగంలో అతడు వరుసగా స్వర్ణాలు సాధించాడు. జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డబ్ల్యూపిడిఏ నుంచి అతడికి ఆఫర్లు వచ్చినప్పటికీ పట్టించుకోలేదు. 2015లో జావెలిన్ త్రో లో నదీమ్ సుదీర్ఘ ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సంవత్సరం వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి ఉపకార వేతనం దక్కించుకున్నాడు. మారిష స్లోని ఐఏఏఎఫ్ హై పెర్ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ చాలాసార్లు గాయపడ్డాడు. ఇదే సమయంలో పాకిస్తాన్ అతనికి ఉపకార వేతనం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఖర్చులకోసం గ్రామస్తులు చందాలు వేసుకొని నదీమ్ కు డబ్బులు పంపడం మొదలుపెట్టారు.

2016లో నదీమ్ – నీరజ్ చోప్రా సౌత్ ఏషియన్ గేమ్స్ లో తొలిసారి తలపడ్డారు. ఆ పోటీలలో నీరజ్ స్వర్ణం దక్కించుకున్నాడు. నదీమ్ కాంస్యం అందుకున్నాడు. ఇక నదీమ్ తన పూర్తిస్థాయి శిక్షణను పాకిస్థాన్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం లోని ఓ పురాతన జిమ్ లో కొనసాగించాడు. అక్కడి పరికరాలు మొత్తం తుప్పు పట్టి పోయాయి.. అయినప్పటికీ వాటినే అతడు ఉపయోగించుకున్నాడు. చివరికి అక్కడ ఏసీ లేకపోయినప్పటికీ.. అతడు ఆట మీద మక్కువతో తనను తాను రాటు తేల్చుకున్నాడు. ఇక 2022లో నదీమ్ ఏకంగా 90 మీటర్ల మైలురాయి దాటి కామన్వెల్త్ లో స్వర్ణం దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ లో మెడల్స్ సాధిస్తాడని పాకిస్తాన్ ప్రజలు అనుకున్నారు. పోటీలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అతడిని విపరీతమైన కష్టాలు చుట్టుముట్టాయి. గత ఏడాది ఆశకు క్రీడల్లో పాల్గొనలేకపోయాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు తన ఒలంపిక్ శిక్షణ మొదలుపెట్టాడు. గాయం వల్ల శస్త్ర చికిత్స చేయించుకొని, రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మరో గాయం కావడంతో చాలా రోజులపాటు గ్రౌండ్ కు దూరమయ్యాడు.

మరోవైపు ఒలింపిక్స్ కు టైం దగ్గర పడుతున్న కొద్ది నదీమ్ వద్ద ఉన్న 2015 నాటి జావెలిన్ త్రో కు ఉపయోగించే బల్లెం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నది. ఈ విషయాన్ని అతడు తన కోచ్ సల్మాన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతడికి కొత్త జావెలిన్ వచ్చింది. ఈ విషయంపై భారత ఆటగాడు నీరజ్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కొత్త జావెలిన్ ఇవ్వాలని కోరాడు. అయితే ఆ ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. మరోవైపు ఈసారి పారిస్ ఒలంపిక్స్ కు పాకిస్తాన్ నుంచి కేవలం ఏడుగురు అథ్లెట్స్ మాత్రమే వచ్చారంటే అక్కడ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో సింధ్ ప్రావిన్స్ 5కోట్ల నగదు బహుమతి ప్రకటించింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular