Pakistan stadiums : క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. క్రీడాకారులు మాత్రమే కాదు.. ఆడే పరిసరాలు కూడా అలానే ఉండాలి. కానీ పాకిస్తాన్ జట్టు ఇందుకు పూర్తి విరుద్ధం. ఆటగాళ్లకు క్రమశిక్షణ ఉండదు. బోర్డుకు అజమాయిషీ ఉండదు. పైగా ఆ జట్టు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. ఆ జట్టు ఆటగాళ్లు తమ పని తాము చూసుకోకుండా.. నిత్యం భారత జట్టు ఆటగాళ్లతో కంపేర్ చేసుకుంటారు. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ తో పోల్చితే బాబర్ ఆజం గొప్ప అని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఉత్తమమని.. టీమిండియా పాకిస్తాన్ జట్టుతో సరిపోలదని అక్కడి ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు తల తిక్క వ్యాఖ్యలు చేస్తుంటారు. వాస్తవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బతుకుతున్నదే బీసీసీఐ దయా దాక్షిణ్యాల మీద. ఆ విషయం తెలిసినప్పటికీ పాకిస్తాన్ బోర్డు, ఆ జట్టు ఆటగాళ్లు మిడిసి పడుతుంటారు.
ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను గెలుచుకోవాల్సింది పోయి.. సమం చేసుకుని పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లు పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా ఆటగాళ్లదారిలోనే ఇజ్జత్ మొత్తం తీసుకుంది. ప్రపంచ క్రికెట్లో తమకంటే ధనవంతమైన బోర్డు లేదని.. మా ముందు బీసీసీఐ కూడా వేస్ట్ అని ఆ మధ్య పిసిబి వ్యాఖ్యలు చేసింది.. కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి లాగే, ఆ దేశ క్రికెట్ బోర్డు దుస్థితి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని పెషావర్ ప్రాంతానికి చెందిన క్రికెట్ స్టేడియం అత్యంత దారుణంగా మారింది. ఇక్కడ అంతర్జాతీయ మ్యాచులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎంతో పేరున్న ఈ స్టేడియాన్ని పాకిస్తాన్ ఎప్పుడో గాలికి వదిలేసింది. ఫలితంగా ఈ మైదానంలో విపరీతంగా గడ్డి పెరిగిపోయింది. చూస్తుంటే ఒక చిట్టడివిలాగా కనిపిస్తోంది. దీంతో కొంతమంది కూలీలను పెట్టి ఆ గడ్డిని కత్తిరిస్తున్నారు. వాస్తవానికి క్రికెట్ మైదానాలలో గడ్డి పెరిగితే, దానిని యంత్రాలతో కత్తిరిస్తారు. నేపాల్ లాంటి చిన్న దేశాలలో కూడా గడ్డి కత్తిరించే యంత్రాలు ఉంటాయి. కానీ పెషావర్ లాంటి క్రికెట్ స్టేడియం లో మాత్రం పెరిగిన గడ్డిని కూలీలతో కత్తిరించడం చర్చనీయాంశంగా మారింది. మైదానంలో కొంతమంది కూలీలు కొడవళ్లతో అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డిని కోస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. అలా గడ్డిని కోసి ఒక కుప్పలు లాగా పోసిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఏకిపారిస్తున్నారు. రిచ్ క్రికెట్ బోర్డు వద్ద గడ్డి కత్తిరించేందుకు యంత్రాలు కూడా లేవా అంటూ దెప్పిపొడుస్తున్నారు. మైదానాలు ఇలా ఉంటే, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మీరు అంతకుమించి పీకలేరు కానీ.. ముందు అందులో గేదెలను మేపుకోండి అంటూ హితవు పలుకుతున్నారు.
Pakistan's Peshawar Cricket Stadium.
Saj_idkhan56 / Insta pic.twitter.com/AtbYJcbQxt
— CricketGully (@thecricketgully) May 4, 2024