Chandigarh Test Day 1 India score: అనుకున్నట్టుగానే చండీగఢ్ టెస్ట్ సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూసుకుపోతోంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండడంతో టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఈ టెస్ట్ లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది. దానిని మనసులో పెట్టుకున్న భారత బ్యాటర్లు దూకుడుగా పరుగులు సాధిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
ఓపెనర్ కేఎల్ రాహుల్ (100), సాయి సుదర్శన్ (81) కదం తొక్కితే.. కెప్టెన్ గిల్ (103*), రిషబ్ పంత్ (50*) సత్తా చూపించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగించి ప్రత్యర్థి జట్టు మీద మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. టీమిండియా ప్లేయర్లు తమకు లభించిన జీవధానాలను సద్వినియోగం చేసుకోవడంతో.. భారీ స్కోర్ సాధ్యమైంది.
కొంతకాలంగా తెలుపు రంగు బంతిలో మాత్రమే భారత ఆటగాళ్లు మ్యాచులు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బాల్ ఫార్మాట్ లో సెట్ అవ్వడానికి టైం తీసుకుంటారని అభిమానులు అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండా టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ లోపాలను సద్వినియోగం చేసుకొని పరుగులు రాబట్టారు. జైస్వాల్ (24) మినహా మిగతా బ్యాటర్లు మాత్రం దుమ్మురేపారు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.
ఈ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. పైగా ఐపీఎల్ సాగుతున్నప్పుడు బ్యాటర్లకు స్వర్గధామంగా ఈ మైదానం ఉంది. అయితే భారత బ్యాటర్లు మాత్రం ఆఫ్గనిస్తాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో రషీద్ ఖాన్ లేకపోవడంతో.. ఆ లోటు స్పష్టంగా కనిపించింది. బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ స్థాయిలో బంతులు వేయలేకపోవడంతో.. భారత బ్యాటర్లు పండగ చేసుకున్నారు. కొన్ని సందర్భాలలో భారత బ్యాటర్లను అవుట్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఉపయోగించుకోలేకపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
రెడ్ బాల్ ఫార్మాట్లో ఈ కాలపు రాహుల్ ద్రావిడ్ లాగా పేరు తెచ్చుకున్నాడు కేఎల్ రాహుల్. మరోసారి తాను ఎందుకు అంత స్పెషలో నిరూపించుకున్నాడు. క్లాసిక్ షాట్లు ఆడుతూ అదరగొట్టాడు. కెప్టెన్ గిల్ కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. పిచ్చి బంతులను బౌండరీలకు తరలించిన అతడు.. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ విఫలమైనప్పటికీ.. రెడ్ బాల్ ఫార్మాట్లో మాత్రం అదరగొట్టాడు. ఇప్పటికైతే 70 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. రెండవ రోజు ఇదే దూకుడు కొనసాగిస్తే సెంచరీ పూర్తి చేసుకుంటాడు.
Nothing beats the feeling of a century at home ️#TeamIndia skipper Shubman Gill soaking in all the applause
Updates ▶️ https://t.co/Au50EfVM30#INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/eq9y5kFr9t
— BCCI (@BCCI) June 6, 2026
