
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకొని ఆగమేఘాల మీద వైజాగ్ చేరుకొని, అక్కడి నుంచీ కాకినాడ వెళ్ళి, అక్కడ జనసేన, వైసీపీలకి మధ్య జరిగిన గొడవలలో గాయపడిన తన జనసేన కార్యకర్తలని పరామర్శించారు. పరమర్సలు అనంతరం వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఘటన తాలూకు డ్యామేజ్ చెప్తూనే ఆవేశపూరితమైన ప్రసంగం చేసారు.
ఇదిలాఉంటే ఈ ప్రసంగం మధ్యలోనే పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ టూర్ లో ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడాను అంటూనే.. టూర్ వెనుక అసలు కారణం మాత్రం చెప్పలేదు. దాంతో కార్యకర్తలకి బుర్ర హీటెక్కింది. ఇక్కడ జరిగన ప్రతీ విషయం కేంద్రం దృష్టిలో పెట్టా ఇక కేంద్రమే అన్నీ చూసుకుంటుంది అన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉండటం కొంత ఆసక్తిని రేకెత్తించాయి. మరో అడుగు ముందుకు వేసిన పవన్ సభకి నమస్కారం తెలిపే సమయంలో త్వరలో అంటే 16 న విజయవాడలో బీజేపీ తో కీలక మీటింగ్ ఉంటుందని చెప్పారు.
16 తేదీ కనుమ రోజున బీజేపీ, జనసేన కీలక మీటింగ్ అని ప్రకటించగానే ఎవరి బుర్రలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆలోచనలో పడ్డారు. కొంతమందికైతే జనసేన అధినేతకి ఏపీలో పార్టీని నడపలేమనే క్లారిటీ వచ్చింది కాబట్టి , ఇక ఈ మీటింగ్ అనంతరం జనసేన ని బీజేపీలో విలీనం చేసేస్తారా అనే సందేహం వచ్చిందట. ఇంకొంతమంది ఇకపై ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీ తో కలిసి నడవడానికి రెండు పార్టీలు ఏకం అవ్వడానికే ఆ మీటింగ్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరి అభిప్రాయం వారిదే అయినా పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే 16 వరకూ వేచి చూడాల్సిందే..