Home Blog Page 8471

ఆరో తేదీ రాత్రి 9 గంటలకు రెడీగా ఉండమంటున్న ఆర్జీవీ


రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్ హిట్స్‌ తీసిన ఆర్జీవీ కొన్నేళ్లుగా వివాదాస్పద సినిమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటూ తనకు తానే సాటి అని నిరూపించుకోవడం ఆయనకే చెల్లింది. అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్‌టీ (గాడ్ సెక్స్‌ ట్రూత్‌) అనే షార్ట్‌ ఫిలింతో సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈ మధ్య వరుస సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కుర్రకారుకు నిద్రలేకుండా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘క్లైమాక్స్‌’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది.

లాక్‌డౌన్‌ సమయంలో టీజర్, ట్రైలర్, పాట విడుదల చేయగా.. అదిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఎడారి బ్యాక్‌డ్రాప్‌లో మియా తన అందాలతో యూత్‌ హార్ట్‌బీట్‌ పెంచేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఆర్జీవీ ప్రకటించారు. జూన్ ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటలకు తన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, ఇది ఫ్రీగా చూపించే మూవీ కాదట. ఆర్జీవీ వరల్డ్‌డాట్‌ ఇన్‌, లేదంటే శ్రేయాస్‌ ఈటీ ద్వారా పే ఫర్ వ్యూ మోడల్‌లో రూ. 100 చెల్లించి చూడాలని చెప్పారు. ఆ లోపు మరో ట్రైలర్ను శనివారం రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి, వర్మ పనితనం, మియా మాల్కోవా అందచందాలు చూడాలంటే జూన్ 6 వరకు వెయిట్ చేయాలన్నమాట.

ఆమె హఠాన్మరణం బాధాకరం:పవన్

Pawan kalyan

ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక హఠాన్మరణం చెందడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ గారి కోడలు సుహారిక మృతి కలచివేసిందని పేర్కొన్నారు. చిన్నవయసులోనే ఆమె మరణించడం బాధాకరమని, అప్పటివరకు స్నేహితులతో ఉత్సాహంగా గడిపి ఉన్నట్టుండి కుప్పకూలిపోయి ప్రాణాలు విడవడం దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. ఈ ఘటన కన్నా గారి కుటుంబానికి, ముఖ్యంగా సుహారిక భర్త ఫణీంద్రకు ఊహించని విపత్తు వంటిదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ విషాదం నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, ఇతర కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సుహారిక మృతికి తన తరఫున, జనసేన తరఫున పవన్ సంతాపం వ్యక్తం చేశారు.

గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ


ఓ వైపు కరోనా.. మరోవైపు మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా మహమ్మరి ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. అయితే మండే ఎండల నుంచి రిలీఫ్ పొందే గుడ్ న్యూస్ ను వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోకి మరో 24గంటల్లో రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరో మూడ్రోజుల్లో అంటే జూన్ 1న నాటికి కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనునున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది.

ఛత్తీస్‌గఢ్‌ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు మధ్య ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తరించిందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. మరో రెండ్రోరోజుల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గుతాయని తెలిపింది. అయితే వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే 6, 7తేదిల్లోగా రాయలసీమకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 72గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు ఉండాలని కోరింది.

బాలయ్య నోటిదురుసు.. టీడీపీకి భారీ నష్టమా?


రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయని చాలా గొప్ప సామెత ఉంది. ఇప్పుడు దాన్ని అక్షరాల నిజం చేసుకుంటున్నారు మన అగ్రహీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట… 151మంది ఎమ్మెల్యేలతో గెలిచి అఖండ మెజార్టీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా తయారవుతున్నాడు. ఆయనను ఆపడం ఒక్క చంద్రబాబుతో అయ్యే పని కాదు. లోకేష్ అంత బలంగా లేడు. ఈ నేపథ్యంలో విడిపోయిన టీడీపీ, జనసేన ఒక్కటవ్వాలని చూస్తున్న వేళ బాలయ్య మాటలు ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు.

*బాబు-పవన్ దోస్తీ దిశగా..
ఏపీలో విడిపోయి పోటీచేసి దారుణంగా దెబ్బతిన్న చంద్రబాబు, పవన్ లు దోస్తీ దిశగా అడుగులు వేస్తున్నారు. పవన్ ఇప్పటికే బీజేపీతో కలిసిపోగా.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని కలుపుకుపోయి త్రిముఖ పార్టీలు కలిసి పోటీచేసి జగన్ ను ఓడించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. అలాంటి పొత్తుకు ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు శరాఘాతంగా మారాయంటున్నారు.. జనసేనతో సంబంధాలు బాలయ్య వ్యాఖ్యలతో దెబ్బతిన్నాయన్న చర్చ టీడీపీలో సాగుతోంది.

*బంధంపై నిప్పులు పోసిన బాలయ్య
తెలంగాణ ప్రభుత్వంతో సినిమాల షూటింగ్ లు, థియేటర్స్ ఓపెనింగ్ కు తనను పిలవలేదని.. భూములు పంచుకుంటున్నారని బాలయ్య సినీ పెద్దలపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఘాటు స్పందించి బాలయ్యను ‘మూసుకొని కూర్చో.. నువ్వు జస్ట్ హీరోవి’ అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో దగ్గరవుదామనుకున్న జనసేన-టీడీపీ బంధానికి బాలయ్య అడ్డుగా మారాడు. బాలయ్య స్వయాన టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిదే కాకుండా టీడీపీ ఎమ్మెల్యే. సో బాలయ్య నోటి దురుసు అంతిమంగా జనసేనతో సంబంధాల దిశగా అడుగులు వేస్తున్న టీడీపీకి, చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా మారిందని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.

*ఏకాకి అవుతోన్న బాలయ్య
ఇక బాలయ్య నోటిదురుసు కేవలం జనసేనతో సంబంధాలనే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని, టాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా కెలికినట్టు అయ్యింది. దీంతో ఇప్పుడు అందరూ దూరమయ్యే చాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఊరుకునే అవకాశాలు లేవు. బాలయ్య వ్యాపారాలు, సినిమాలకు అనుమతుల విషయంలో మోకాలడ్డే అవకాశాలున్నాయి. ఇటు సినీ పెద్దలు సైతం బాలయ్యను ఏకాకిని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తంగా బాలయ్య నోటి నుంచి వచ్చిన విమర్శలు టీడీపీకి తీవ్ర నష్టం తేగా.. బాలయ్యను సినీ ఇండస్ట్రీలో ఏకాకిని చేశాయనే చెప్పాలి.

-నరేశ్ ఎన్నం

కేసీఆర్ కి అసదుద్దీన్‌ శుభాకాంక్షలు!

Owaisi

Owaisi

కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్ కి ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు. కొండపోచమ్మ సాగర్‌ గొప్ప ముందడుగు. జలాశయం ద్వారా   రైతులకు సాగునీరు,  గృహాలకు మంచినీరు అందుతాయి.’ అని ఎంపీ ట్వీట్‌ చేశారు.

కొండపోచమ్మ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ దంపతులు  ప్రారంభించారు. మర్కూక్‌ పంప్‌ హౌస్‌ నుంచి ఈ రిజర్వాయర్‌ లోకి గోదావరి  నీరు చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుతఘట్టం ఆవిషృతమైంది. కొండపోచమ్మ సాగర్‌ కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి.

లాక్ డౌన్ 5.0 : ఈసారి భారీ సడలింపులివే?


దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నేటికి 68 రోజులవుతోంది. మే 31తో ఇది ముగియబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ 5.0కు సంబంధించిన ప్రణాళికల్లో పడింది. ఈ మేరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి మాల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరవడానికి , పరిమితులను తగ్గించడానికి వీలుగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ కొనసాగేలా కొత్త నిబంధనలు విధించనున్నట్లు తెలుస్తోంది.

మే 31న ప్రధాని మోడీ మన్ కీబీత్ కార్యాక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ఈసారి మరికొన్ని సడలింపులు .. కీలక నిర్ణయాల దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

లాక్ డౌన్ 5.0లో ప్రధానంగా దేశంలోని 11 నగరాలపైనే దృష్టి సారించబోతున్నారట.. ఈ 11 నగరాల్లోనే దేశవ్యాప్తంగా 70శాతం కేసులు వెలుగుచూస్తున్న దృష్ట్యా ఇక్కడే లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని మోడీ ప్రణాళిక రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జూన్ 1 నుంచి మొదలయ్యే లాక్ డౌన్ 5.0లో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, థానే, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్ కతా నగరాల్లో కరోనా కట్టడిపై ఫోకస్ చేయనున్నారని తెలిసింది. దేశవ్యాప్తంగా నమోదైన 1.51 లక్షల కేసుల్లో కేవలం ముంబై, ఢిల్లీ, ఫుణే, కోల్ కతా, అహ్మదాబాద్ లలోనే 60శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నగరాల్లోనే నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.

దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల్లో 80శాతం నమోదవుతున్న 30 మున్సిపల్ కార్పొరేషన్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని.. ఈసారి అక్కడ గట్టిగా లాక్ డౌన్ విధించి దేశమంతా భారీ సడలింపులు ఇస్తుందని సమాచారం.

ప్రధానంగా ఈ లాక్డౌన్ 5.0లో దేవాలయాలు, మసీదులు, చర్చీలు తెరుచుకునేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రార్థనా స్థలాల్లో భారీగా ప్రజలు గుమిగూడడం నిషేధిస్తూ నిబంధనలు పాటించేలా అనుమతించేందుకు కేంద్రం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రార్థనా స్థలాలకు జూన్ 1 నుంచి అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇక లాక్డౌన్ 5.0లో జిమ్ లకు కూడా అనుమతించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని చోట్ల జిమ్ లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ప్రతీ ఒక్కరు మాస్క్ , భౌతిక దూరంతో ఇవన్నీ నడవనున్నాయి.

ఢిల్లీ ఇతర మెట్రోలను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉంది. మార్కెట్లు తెరవడంతోపాటు మతపరమైన ప్రార్థనాలయాలు కూడా తెరువనున్నట్టు తెలుస్తోంది. విద్యాసంస్థలు కనీసం 10 రోజులు మాత్రమే తెరువాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని సమాచారం. కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం నిబంధనలు కఠినతరం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

జూన్ 1 నుంచి కరోనా ప్రబలే కంటైన్ మెంట్ జోన్ల నిర్ణయాధికారం అక్కడి మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్రం కట్టబెడుతోంది. కొత్త మార్గదర్శకాలు 70శాతం కేసులు దేశంలో నమోదవుతున్న 13 నగరాల్లో మరింత కఠినంగా రూపొందిస్తున్నారు. ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానే, ఫుణే, హైదరాబాద్, కోల్ కతా, మరియు దాని పక్కనే ఉన్న హౌరా, ఇండోర్, జైపూర్ , జోద్ పూర్, చెంగల్పట్టు , తిరువల్లూరు. ఈ నగరాల్లో దేశంలోనే మూడు నగరాలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ నగరాల్లో కేంద్రం కఠినమైన చర్యల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

-నరేశ్ ఎన్నం

నిమ్మగడ్డ కేసుపై సుప్రీం కోర్టుకు జగన్ సిద్ధం!


జగన్ ప్రభుత్వం మొదటి వార్షికోత్సవం జరుపుకొంటున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఆశాభంగం కలిగించినట్లు తెలుస్తున్నది. ఈ తీర్పుపై అధికార పార్టీకి చెందిన వారెవ్వరూ ఎటువంటి వాఖ్యానాలు చేయక పోవడం గమనార్హం. కేవలం టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాత్రం కోర్టులు తమ పరిధిలో తీర్పులు ఇస్తుంటాయని, వాటిని గౌరవించవలసిందే అంటూ చెప్పారు. తర్వాత ఏమి చేయాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని చెప్పారు.

అయితే ఇటువంటి తీర్పు రాగలదని ముందు నుండే ఊహిస్తున్నట్లు కనిపిస్తున్నది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఎపి సర్కార్‌ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో తీర్పు రాగానే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్ న్యాయవాదులను సంప్రదించినట్లు చెబుతున్నారు.

తీర్పు తమకు ప్రతికూలంగా వస్తుందని ఊహించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడంతో దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్దపడుతున్నది. అక్కడ సహితం ఇంతకన్నా భిన్నమైన తీర్పు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నప్పటికీ అధికార పక్షం ఆలోచనలు వేరే విధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

కనీసం సుప్రీం కోర్ట్ లో స్టే వచ్చేటట్లు చేసుకొని, తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల పక్రియను పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.

కొమ్మినేనితో సహా 44 మందికి నోటీసులు..!


న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై హైకోర్టు మరో 44 మందికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి హైకోర్టు విచారణ చేపట్టింది. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, పంచ్ ప్రభాకర్ తో సహా మరో 44 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

ఈ అంశంపై గతంలో 49 మందిపై హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిలో ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. సీఐడీ అధికారులు కొందరికి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ రోజు విచారణలో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న విషయంపై సీఐడీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేశారు. సీఐడీ అధికారి రాధిక కోర్టుకు హాజరై ఈ కేసులో తీసుకుంటున్న చర్యలను కోర్టుకు వివరించారు.

కరోనా దెబ్బకు న్యూస్ ఛానల్ మూసివేత


ఒక వీడియో జర్నలిస్ట్ కరోనా మహమ్మారి కారణంగా చనిపోగా, ముందుజాగ్రత్తగా ఆ న్యూస్ ఛానల్ ను తాత్కాలికంగా మూసివేశారు. పైగా అది దేశ రాజధానిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్న డిడి న్యూస్ ఛానల్ కావడం గమనార్హం.

ఢిల్లీలోని దూరదర్శన్ న్యూస్ చానెల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న యోగేశ్ కుమార్ బుధవారం గుండెపోటుతో మరణించాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయగాపాజిటివ్‌గా తేలింది. దాంతో ఆ ఛానల్ లో అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు చేయనున్నారు.

‘డీడీ న్యూస్ చానెల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. శానిటైజేషన్ చేసిన తర్వాత ఆఫీసును త్వరలోనే తెరుస్తాం. అయితే ఆఫీస్ తాత్కాలికంగా మూసివేయడం వల్ల వార్తా ప్రసారాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం’ అని డీడీ న్యూస్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.

‘వీడియో జర్నలిస్ట్ యోగేశ్ కుమార్ బుధవారం తన ఇంట్లోనే గుండెపోటుతో చనిపోయాడు. మేం మా సిబ్బందిని వారంలో రెండు రోజులు మాత్రమే డ్యూటీకి రావాలిని చెప్పాం. కానీ, యోగేష్ మాత్రం ప్రతిరోజు ఆఫీసుకు వచ్చేవాడు’ అని పేర్కొన్నారు.

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయ్యాడు. యోగేష్ మరణంతో డీడీ న్యూస్ ఒక మంచిప్రొఫేషనల్‌ను కోల్పోయింది. యోగేష్ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కూడా అంకితభావంతో విధులు నిర్వర్తించేవాడని డీడీ న్యూస్‌కు చెందిన ఒక యాంకర్ తెలిపారు.

యోగేష్ మరణంతో కెమెరా విభాగానికి చెందిన మొత్తం సిబ్బందిలో కొంతమందిని గురువారం డాక్టర్ రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో పరీక్షించారు. మరికొంతమందిని శుక్రవారం పరీక్షించనున్నట్లు డీడీ న్యూస్ వర్గాలు తెలిపాయి.

సాయివర్ధన్ బోరుబావి ఘటనపై పవన్ స్పందన!

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌ పల్లిలో బోరుబావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్ నిన్న ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలని పవన్ కోరారు. నిర్లక్యం చేస్తే మరింత ప్రమాదమని, ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘నోరు తెరిచిన బోరుబావులకు కళ్లెం వేయాలి.’ అని పవన్ కామెంట్ చేశారు.

ఈ విషాద ఘటనలో 12 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ లో 17 అడుగుల లోతు వద్ద మృతదేహం లభించింది. గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. భిక్షపతి బుధవారం రోజు తన పొలంలో బోర్లు వేశాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో మూడో బోరు బావిని కూడా తవ్వించారు. ఐతే ఆయన మనవడు సాయి వర్ధన్ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వచ్చాడు. బోర్లు వేసిన అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో.. అతడు ఆడుకుంటూ వెళ్లి ఓ బోరుబావిలో పడిపోయాడు. వారి పొలంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

మూడు జిల్లాలకు పొంచివున్న పిడుగుపాటు..?


ఆంధప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో శుక్రవారం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ  హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకుండా ఈ మూడు జిల్లాలు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అందుచేత ఈ మూడు జిల్లాలు చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఇంటికే పరిమితం కావాలని సూచించింది. ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరిగొద్దని, చెట్టల కింద ఉండొద్దని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది. అత్యవసరం ఉండి బయటికి వెళ్లేవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహాణ శాఖ పేర్కొంది.

పిడుగుపాటుకు అవకాశం ఉన్న ప్రాంతాలు..
శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, కొత్తూరు, పాలకొండ, బుర్జ, రేగిడి ఆమదాలవలస, సరుబుజ్జిలి, లక్ష్మీనర్సుపేట, హీరామండలం, వంగర, వీరఘట్టం ప్రాంతాలు పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని కురుపాం, గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, పాచిపెంట, వేపాడ, సీతానగరం, విశాఖపట్నం జిల్లాలోని హుకుంపేట,అనంతగిరి, అరకులోయ ప్రాంతాలు పిడుగుపాటు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహాణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

చ‌త్తీస్‌ ఘ‌డ్ తొలి ముఖ్యమంత్రి కన్నుమూత!

Ajit jogi

Ajit jogi

చ‌త్తీస్‌ ఘ‌డ్ రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన అజిత్ ప్ర‌మోద్ కుమార్ జోగి క‌న్నుమూశారు. గుండెపోటు రావ‌డంతో జోగిని రాయ్‌పూర్‌ లోని ప్రైవేటు హాస్పిట‌ల్‌ లో చేర్పించారు. మే 9వ తేదీన ఆయ‌నకు తొలిసారి గుండెపోటు వ‌చ్చింది. ఆ త‌ర్వాత అప్ప‌టి నుంచి ఆయ‌న హాస్పిట‌ల్‌ లో వెంటిలేట‌ర్‌ పై ఉన్నారు. చికిత్స తీసుకుంటూ.. ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు.

అజిత్ జోగి వ‌య‌సు 74 ఏళ్లు. ఆయన రాజ‌కీయాల్లోకి రాక‌ముందు క‌లెక్ట‌ర్‌ గా కూడా ప‌నిచేశారు. ఆయ‌న రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎ‌న్నిక‌య్యారు. భోపాల్‌ లోని మౌలానా ఆజాద్ టెక్నాల‌జీ కాలేజీలో జోగి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చేశారు. 1968లో ఆయ‌న యూనివ‌ర్సిటీ గోల్డ్ మెడ‌ల్ సాధించారు.  రాయ్‌పూర్‌ లోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కొన్నాళ్ల పాటు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. ఐపీఎస్‌, ఐఏఎస్‌ గా కూడా ఈయ‌న సెల‌క్ట్ అయ్యారు. భోపాల్ క‌లెక్ట‌ర్‌గా 1981 నుంచి 1985 వ‌ర‌కు ప‌నిచేశారు.

2000 నవంబ‌ర్ లో చ‌త్తీస్‌ ఘ‌డ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మూడేళ్లు 2003 న‌వంబ‌ర్ వరకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి అజిత్ జోగి విడిపోయారు.  ఓ ఉప ఎన్నిక విష‌యంలో ఆ పార్టీకి ఆయ‌న గుడ్‌ బై చెప్పాల్సి వ‌చ్చింది.  కాంగ్రెస్‌ ను వీడిన త‌ర్వాత ఆయ‌న జ‌న‌తా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

బోయిన్‌పల్లిలో అగ్ని ప్రమాదం..


హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోయిన్‌పల్లిలోని బాపుజీనగర్లో అపార్ట్ మెంట్ మధ్యలో వలస కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. అయితే శుక్రవారం ఓ గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. గుడిసెకు అంటుకున్న మంటలు పక్కనే ఉన్న గుడిసెలు అంటుకోవడంతో అందులోని మరో సిలిండర్ పేలింది. ఓవైపు చేలరేగుతున్న మంటలకు వడగాడ్పులు తోడవడంతో అగ్నికి అజ్యం పోసినట్లయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

ఈ ప్రమాదం జరిగినపుడు గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిలిండర్ పేలుడు శబ్దానికి స్థానికులంతా బయటికి పరుగులు తీయడంతో పెనూ ప్రమాదం తప్పింది. వెంటనే అపార్ట్ మెంట్ వాసులు ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్లు ప్రమాద స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో గుడిసెలు పూర్తి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది అనేది తేలియాల్సి ఉంది. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

రైతులకు సీఎం గుడ్ న్యూస్… సర్వత్రా ఆసక్తి!

CMKCR

 

CMKCR

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ఆయన ప్రకటించారు. యావత్‌ దేశమే అబ్బురపడే వార్త ఒకటి చెప్పబోతున్నానని ఆయన స్పష్టం చేశారు. రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు రాబోతున్నాయని, తక్కువ కాలంలోనే ఆశించిన ప్రగతిని సాధించామన్నారు.

ఇరిగేషన్‌ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు అని స్పష్టం చేశారు. నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయి. ముఖ్యమంత్రి బాటే.. మా బాట అని రైతులు తీర్మానాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దేశానికి మనం ఆదర్శం కావాలి. 530 టీఎంసీల నీళ్లను వాడుకోగలిగే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకుంది. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో తెలంగాణ అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించి.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని సీఎం తెలిపారు.

లక్ష కోట్ల రూపాయాల పంటను తెలంగాణ రైతాంగం సంవత్సరానికి పండించబోతుంది. దేశంలో 83 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తే.. 53 లక్షలు తెలంగాణ దేశానికి ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయానా ఎఫ్‌సీఐ ప్రకటించిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగానికి ఇది గర్వకారణం. ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్ చేసిన కేసీఆర్


తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. శుక్రవారం కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను ఆయన ప్రారంభించారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామిలు మర్కుక్‌ పంప్‌హౌస్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌లోకి నీటిని ఎత్తి పోసే మోటర్లను ప్రారంభించారు. అనంతరం కొండపోచమ్మ కట్టపై గోదావరి నీటికి సీఎం కేసీఆర్‌ జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదు.. మీరు ఎలా పాలించుకుంటారో చూస్తాం అన్నవారికి నేడు తెలంగాణ రాష్ట్రం ఆరేళ్లలో సాధించిన అభివృద్దే నిదర్శనమని అన్నారు. సాగునీటి చరిత్రలో తెలంగాణ ఇంజనీర్లు అద్భుతాలను ఆవిష్కరించారనిన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజినీర్లు ఎంత శక్తిమంతులో, నైపుణ్యవంతులో ప్రపంచానికి తెలియవచ్చిందన్నారు. తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్ చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన నాలుగు ఊళ్ల ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనలు చేస్తున్నానని చెప్పారు. రైతులకు భూములు కోల్పోయిన బాధ ఉంటుందని అయితే ప్రాజెక్టును గాలిలో కట్టలేమన్నారు. ఈప్రాంతంలోనే ప్రభుత్వం ఫుడ్ టెక్స్ టైల్స్ పార్కులను స్థాపించి అందరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అదేవిధంగా ప్రజలుకు భూపరిహారం అందించాలని సకాలంలో భూములను అందించిన రెవెన్యూ శాఖను కూడా కేసీఆర్ అభినందించారు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణలో సంవత్సారానికి లక్ష కోట్ల రూపాయల పంట పండబోతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 83లక్షల టన్ను వరి ధాన్యం సేకరిస్తే 53లక్షల టన్నులు తెలంగాణ నుంచే వచ్చిందని సాక్షాత్తూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొందని తెలిపారు. కాళేశ్వరానికి 4,800 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. పేరున్న కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయన్నారు. తెలంగాణకు 165 టీఎంసీల నూతన సామర్థ్యం వచ్చి చేరిందన్నారు. ఆరేళ్ల కింద అనాథలా ఉన్న తెలంగాణ నేడు మాత్రం పసిడి పంటల తెలంగాణగా మారిందన్నారు. త్వరలోనే తెలంగాణ రైతులకు మరొక తీపి కబురు చెబుతానని.. దేశం నివ్వెరబోయేలా చేస్తానంటూ కేసీఆర్ ప్రకటించారు.

ఏపీ గవర్నర్ హరిచందన్ కు ఎదురు దెబ్బ!


ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడాన్ని రాష్ట్ర హైకోర్ట్ కొట్టివేయడంతో రాజకీయంగా ఆయనకే కాకుండా, రాష్ట్ర గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ కు సహితం పెద్ద ఎదురు దెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు. హడావుడిగా ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సు పై గవర్నర్ సంతకం చేయడం ఈ మొత్తం వ్యవహారానికి మూలం కావడం గమనార్హం.

రమేష్ కుమార్ పదవీకాలం తగ్గించే దిశలో జారీచేసిన ఆర్డినెన్సు చెల్లదని, రాజ్యాంగ విరుద్ధమని మాత్రమే కాకుండా, అటువంటి ఆర్డినెన్సు జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్ట్ స్పష్టం చేయడం గమనార్హం. నేరుగా గవర్నర్ చర్యను ప్రశ్నించక పోయినప్పటికీ హడావుడిగా ఆర్డినెన్సు పై సంతకం చేసిన గవర్నర్ సహితం అందుకు బాధ్యత వహించవలసి ఉంటుంది.

ఒడిశాలో సీనియర్ బిజెపి నేత అయిన గవర్నర్ కనీసం న్యాయ అభిప్రాయం కూడా కోరకుండా రాజకీయ కారణాలచేతనే నిముషాలలో సంతకం చేశారనే విమర్శలు అప్పట్లోనే చెలరేగాయి. ఉదయం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రివర్గం నుండి ఎటువంటి చర్చ లేకుండా అనుమతి పొందిన ముఖ్యమంత్రి వెంటనే గవర్నర్ సంతకం కోసం ఫైల్ పంపారు. అయన సహితం ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే సంతకం చేశారు.

ఈ మొత్తం వ్యవహారం అంతా రెండు, మూడు గంటల వ్యవధిలో జరిగింది. ఎన్నికల కమీషన్ నిర్మాణంలో ఇటువంటి కీలక మార్పులు తీసుకురావాలనే అంతకు ముందు మరెక్కడా ఎటువంటి చర్చ జరిగిన ఉదంతం కూడా లేదు. అటువంటప్పుడు గవర్నర్ కనీస పరిశీలన చేయకుండా సంతకం చేయడం పలు విమర్శలకు దారితీసింది.

అయితే జగన్ కు కొందరు బిజెపి నేతలతో ఉన్న అనుబంధంతోనే ఈ విధంగా జరిగినదని విమర్శలు సహితం వినవస్తున్నాయి. సీనియర్ బిజెపి నేతల ప్రోద్బలం కారణంగానే గవర్నర్ ఆ విధంగా సంతకం చేసి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

క్రియాశీల రాజకీయాల నుండి గవర్నర్ పదవిలోకి వచ్చాకా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మనం కోరుకొంటున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదని ఈ ఉదంతం మరోమారు స్పష్టం చేస్తుంది.

హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది: పవన్


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కేసులో హైకోర్టు తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.

ఈ తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసాన్ని ఇనుమడింప చేసిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయి అనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పుతో మరోమారు అవగతమైందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి కొనసాగించాలనే తీర్పును తక్షణమే అంగీకరించి, రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభీష్టానికి భిన్నంగా వెళ్లారనే కారణంతోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ హోదాలో కరోనా విపత్తు ఎంత ప్రమాదకరమైనదో గ్రహించి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరుని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించలేదని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై ముఖ్యమంత్రితోపాటు, అధికార పక్షంవాళ్లు చేసిన వ్యాఖ్యలు వారి ధోరణిని వెల్లడించాయన్నారు.

కరోనాతో ప్రజలు ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ ను తప్పించే ప్రక్రియపై దృష్టిపెట్టి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఏకస్వామ్య ప్రభుత్వంగానో, నియంతృత్వ ధోరణితోనో పాలన సాగిస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందని గ్రహించాలని చెప్పారు. అధికార యంత్రాంగం పాలకులకు రాజ్యాంగం గురించీ, చట్టం గురించీ అవగాహన కల్పించాలని, లేదంటే న్యాయ స్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సి వస్తుందన్నారు.