YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి కొంత మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా? కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఆ పరిస్థితుల్లో ఉన్నారా? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొంతమంది వైసీపీ సోషల్ మీడియా సైన్యం దీనిపైనే ప్రచారం చేస్తోంది. కూటమి తరుపున 164 మంది గెలిచారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకరిద్దరి ఎమ్మెల్యేల వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పై లైంగికపరమైన ఆరోపణలు రావడంతో పార్టీ పక్కన పెట్టింది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ఆయనను టిడిపి హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అటువంటివారు వైసీపీకి టచ్ లోకి వెళ్లినా వెళ్లి ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకునే స్థితిలో మాత్రం లేదు. కానీ అటువంటి వారితో వైసీపీ ఏం రాజకీయం చేయగలదు తెలియాలి మరి.
* అప్పట్లో నలుగురు.
సరిగ్గా వైసిపి అధికారంలో ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంతో విభేదించారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైసిపి పాలనకు ఇంకా 16 నెలల కాలం ఉండగానే వారు ఆ పార్టీని…ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. వారితో పాటు అదే జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఉండవల్లి శ్రీదేవి అసమ్మతి స్వరం వినిపించారు. అయితే అందులో ఆనం రామనారాయణరెడ్డి తో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారు. అయితే వారికి రాజకీయంగాను మంచి పట్టు ఉంది. అన్నింటికీ మించి క్రెడిబిలిటీ ఉంది. అయితే ఇప్పుడు వైసిపి ప్రచారం చేస్తున్నట్టుగా టిడిపి ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారని అనుకుందాం. అయితే వారు టిడిపి వద్దనుకున్న తర్వాత మాత్రమే టచ్ లోకి వచ్చినట్లు అవుతుంది . అటువంటి వారు టచ్ లోకి వస్తే ఎంత? రాకపోతే ఎంత అనే వాదన వినిపిస్తోంది.
* ఎంతవరకు ప్రయోజనం..
ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఎవరికి ఉండదు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపిలోకి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అటు తరువాత 2019 ఎన్నికల్లో అదే వైసిపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఫిరాయించారు . కానీ 2024 ఎన్నికల్లో టిడిపి బంపర్ మెజారిటీతో గెలిచింది. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన వారితో వచ్చే ప్రయోజనం ఉండదు. కానీ రాజకీయంగా ప్రభావం చూపే నేతలతో మాత్రం కొంచెం ప్రయోజనం ఉంటుంది. అయితే ఎప్పటికీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు లేదు. ఒకరిద్దరూ పై టిడిపి హై కమాండ్ అనధికార బహిష్కరణ వేసిన నేపథ్యంలో.. వారికి పొలిటికల్ గా అంత ప్రాధాన్యత లేకపోయినా నేపథ్యంలో అటువంటి వారు టచ్లోకి వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే వారితో వైసీపీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. లోలోపల ఆనందం తప్ప..
YSRCP And DMK: అప్పుడు వైసిపి.. ఇప్పుడు డీఎంకే … ఏం తేడాలే!
YSRCP And DMK: తమిళనాడులో డిఎంకెతో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సారూప్యత ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే తమిళనాడులో డీఎంకే కూడా ఓటమి చవిచూసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మాత్రం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. డీఎంకే గౌరవప్రదమైన స్థానాలు సాధించింది. అయితే డిఎంకె ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. తమ హయాంలో జరిగిన మంచి పనులు కంటే.. తప్పుడు విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. పైగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నోటి దూల ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి నోటి దూల కలిగిన నేతలతోనే ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంది.
* అడ్డదిడ్డంగా మాట్లాడి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది. ఆ సమయంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఏమయింది కొత్త విగ్రహం పెడతాం కదా అని చాలా తేలిగ్గా మాట్లాడారు. రథం దగ్ధమైతే మళ్లీ కొత్త రథం ఏర్పాటు చేస్తాం అన్నట్టు వ్యాఖ్యానించారు. కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే జైలులో దోమలు కుడుతున్నాయని చెబితే.. ఆయన కోసం రంభ ఊర్వశిలు వస్తారా అని ఎద్దేవా చేశారు కూడా. అయితే ఇటువంటి ఘటనలు తటస్థ ఓటర్ల పై ప్రభావం చూపిస్తాయి. ఏపీలో అటువంటి ప్రభావం కనిపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై. అందుకే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అచ్చం అలానే వ్యవహరించింది తమిళనాడులో డీఎంకే.
* మెరుగైన పాలన అందించినా..
అయితే ఏపీతో పోల్చుకుంటే తమిళనాడులో మెరుగైన పాలన అందించింది డిఎంకె ప్రభుత్వం. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. పెట్టుబడులు కూడా పెరిగాయి. కానీ డిప్యూటీ సీఎం గా ఉన్న ఉదయనిధి స్టాలిన్ మతపరంగా చేసిన కామెంట్స్ తో హిందూ మతం పూర్తిగా దూరమైంది. పైగా కొన్ని మీడియా సంస్థలు సైతం ఆయనకు దూరమయ్యాయి. ఏపీలో కూడా పరిస్థితి అదే. సాక్షితోపాటు అనుకూల మీడియాలను నమ్ముకొని ఏది పడితే అది మాట్లాడేసారు. అడ్డగోలుగా సమర్థించుకున్నారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు కూడా. ప్రధానంగా తాము మంచి చేసాం అని మాత్రమే బలంగా నమ్మారు. కానీ తమ పార్టీలో అస్తవ్యస్త విధానాలను మాత్రం నియంత్రించుకోలేకపోయారు. దాని ఫలితమే ఓటమి.