TMC Split Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 28 ఏళ్ల ప్రస్థానం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇప్పటివరకు ఎదుర్కొనని తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో చెలరేగిన అసంతృప్తి, ఒక కొత్త ఎమ్మెల్యే నేతృత్వంలో భారీ తిరుగుబాటుగా మారింది. 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది మద్దతుతో రీతాబ్రత్ బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎదగడం టీఎంసీ చరిత్రలోనే అసాధారణ ఘటన.
ఎవరీ రీతాబ్రత్ బెనర్జీ..?
’రీతాబ్రత్ బెనర్జీ 1979 నవంబర్ 15న న్మించాడు. విద్యార్థి రాజకీయాల ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిది ఏళ్లు చురుగ్గా పని చేశారు. 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికై జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి బహిష్కరించబడ్డారు. తర్వాత టీఎంసీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమయ్యాడు. ఇటీవలి ఎన్నికల్లో ఉలుబేరియా పూర్వ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తిరుగుబాటుకు మూల కారణాలు..
టీఎంసీలో తిరుగుబాటు సిద్ధాంతపరమైనది కాదు. ఇది నాయకత్వం, అధికార పంపకాలు నిర్ణయాల కేంద్రీకరణపై ఉన్న తీవ్ర అసంతృప్తి నుంచి ఉద్భవించింది. ఎన్నికల ఓటమి తర్వాత మమతా బెనర్జీ నివాసంలో జరిగిన కీలక సమావేశానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, ఆమె నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి తక్కువ హాజరు ఇవి పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టాయి. ముఖ్యంగా మమతా–అభిషేక్ బెనర్జీ ద్వయం చేతుల్లో నిర్ణయాలు పూర్తిగా కేంద్రీకృతం కావడం, సీనియర్, మధ్యస్థ స్థాయి ఎమ్మెల్యేలు సైడ్లైన్ అవుతున్నారనే భావన బలంగా పెరిగింది.
టర్నింగ్ పాయింట్ ఇదే..
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నియామకం విషయంలో వచ్చిన గందరగోళం ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు. సంతకాల ఫోర్జరీ ఆరోపణలు, ఫిర్యాదులు, బహిష్కరణలు ఈ క్రమంలో రీతాబ్రత్ బెనర్జీతో పాటు మరికొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఇది తిరుగుబాటు వర్గాన్ని మరింత బలోపేతం చేసింది. రీతాబ్రత్ తనను తాను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మమతా బెనర్జీని ఇప్పటికీ అధినేత్రిగా గౌరవిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా నేరుగా ఆమెపై దాడి చేయకుండా, అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని లక్ష్యం చేసుకున్నారు. ఇది అసంతృప్త ఎమ్మెల్యేలను ఒకేచోట చేర్చడంలో కీలకం అయింది.
రీతాబ్రత్ వ్యూహం ఎలా సక్సెస్ అయింది?
ఎన్నికల ఓటమి తర్వాత ఉన్న సాధారణ అసంతృప్తిని సమర్థవంతంగా వాడుకోవడం. అనుభవం ఉన్న ‘‘అవుట్సైడర్’’ ఇమేజ్తో సీనియర్ నాయకులను ఆకర్షించడం, ఫోర్జరీ వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం, జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో ముందుగానే నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కలిసి ఒక కొత్త ఎమ్మెల్యేకు ఇంత పెద్ద సంఖ్యలో మద్దతు తెచ్చిపెట్టాయి.
ఏం జరగబోతోంది?
టీఎంసీలో చీలిక భవిష్యత్తుపై పెద్ద సందేహాలు రేకెత్తిస్తోంది. రీతాబ్రత్ వర్గం మమతాను ప్రధాన సలహాదారుగా కోరుతున్నప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, అధికార వ్యవస్థ, రాజకీయ వ్యూహాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో విపక్షం ఇంకా బలహీనపడితే బెంగాల్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
















డీఎస్సీ 2025 పై పేకాట ముద్ర.. అడ్డంగా బుక్కైన వైసిపి!
DSC 2025 Controversy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ప్రస్టేషన్లో ఉన్నారు. ఎప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుదామా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అపరిపక్వత మాటలతో ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. డీఎస్సీ 2025 పై కూడా ఇదే మాదిరిగా విషప్రచారం చేస్తున్నారు. ఎంతలా అంటే పేకాట ఆడే వారికి సైతం ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారనేదాకా. వారి పరిస్థితిని చూసి నవ్వాలో.. ఏడవాలో కూడా తెలియడం లేదు. బ్రిడ్జ్ అనే క్రీడాంశాన్ని తీసుకొని.. క్లబ్బుల్లో ఆడే పేకాట అని భ్రమించారు. దానినే ప్రచారం చేసి నవ్వుల పాలయ్యారు. ఎంతలా అంటే ప్రభుత్వంపై కౌంటర్ అటాక్ చేసే మాజీ మంత్రి పేర్ని నాని కూడా అది పేకాట అని తేల్చేశారు. అడ్డంగా బుక్కయ్యారు.
* అంతర్జాతీయంగా గుర్తింపు..
అంతర్జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ చెస్ మాదిరిగా మేధో సంపత్తితో కూడిన బ్రిడ్జ్ అనే క్రీడను గుర్తించింది. అన్ని దేశాలకు ఈ క్రీడల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మన దేశం కూడా ఆ క్రీడాంశాన్ని జత చేసింది. క్రీడా కోట కింద భర్తీ చేసే పోస్టుల విషయంలో ఈ క్రీడను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కల్పించారు. అలా ఆ జాబితాలో 4వ క్రీడగా బ్రిడ్జ్ క్రీడను చేర్చారు. వైసీపీ నేతలు ఇవేవీ గుర్తించకుండా అది పేకాటగా తేల్చేశారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. బ్రిడ్జ్ క్రీడాంశం పేకాట కాదని.. అది మేధో సంపత్తితో కూడుకున్న క్రీడ అని తేల్చింది. అసలు బ్రిడ్జ్ కోటా కింద ఏ ఒక్కరికి ఉపాధ్యాయ పోస్టు మంజూరు చేయలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నెటిజెన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.
* వైసిపి ఆందోళనలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ 2025 పై ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. డీఎస్సీ ప్రశ్న పత్రం లీక్ చేశారని.. అవకతవకలు జరిగాయని.. నియామకాల్లో అడ్డగోలుగా వ్యవహరించారని.. వెబ్సైట్లో వివరాలను డిలీట్ చేశారని ఏవేవో ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. కేవలం డిఎస్సీ అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి రాజకీయ మైలేజ్ పొందాలన్నది వారి ఆలోచన. ఉద్యోగాలు పొందిన 16 వేల కుటుంబాలు అయితే.. డీఎస్సీ పరీక్ష రాసిన వారు ఆరు లక్షల మందికి పైగా. అందుకే వారిలో గందరగోళం సృష్టించి పొలిటికల్ మైలేజీ పొందాలన్నది వైసిపి ఆలోచన. డీఎస్సీ 2025 పై క్రెడిట్ దక్కకుండా చేసేందుకు టిడిపి పై ఆడుతున్న గేమ్ గా తెలుస్తోంది.