India gas shortage : పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధం ఇంకా తగ్గడం లేదు. అమెరికా దాడులు చేస్తూనే ఉంది. ఇజ్రాయిల్ కూడా అదే దారిలో ఉంది. ఇరాన్ ఏ మాత్రం తగ్గడం లేదు. మొత్తంగా అక్కడ నిత్యం రావణ కాష్టం రగులుతూనే ఉంది.
ఇరాన్ దేశంలో చమురు అధికంగా ఉంటుంది. సహజవాయువు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రపంచంలోనే మెజారిటీ దేశాలకు ఇరాన్ నుంచి చమురు.. సహజ వాయువు ఎగుమతి అవుతుంటాయి. హర్ముజ్ జల సంధి నుంచి ఈ రవాణా జరుగుతూ ఉంటుంది. యుద్ధం వల్ల ఈ జల సంధి నుంచి రవాణా జరగడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. చమురు రాకపోవడంతో చాలావరకు దేశాలు ఇంధన ధరలను పెంచేశాయి. దీనికి తోడు డిమాండ్ పెరిగిపోవడంతో రేషనల్లైజేషన్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ఇక సహజ వాయువు విషయంలో కూడా అన్ని దేశాలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి.
మనదేశంలో కూడా డిమాండ్ కు తగ్గట్టుగా సహజవాయువు లభించక పోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చాలావరకు హోటల్లు మూతపడ్డాయి. హాస్టల్లు కూడా తెరుచుకోవడం లేదు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసరమైన సర్వీస్ లకు మాత్రమే గ్యాస్ అనేది సరఫరా అవుతోంది.
కేవలం ఇవి మాత్రమే కాకుండా.. నిత్యవసరాలు.. పప్పులు.. ఎండు ఫలాలు.. ఇతర ఉత్పత్తులు మన దేశానికి రావడం ఆగిపోయింది. దీంతో వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సహజవాయువు కు ఏర్పడిన డిమాండ్ ను కాస్తలో కాస్త తగ్గించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టేది. ఇప్పుడు అందిస్తున్న సిలిండర్ల మాదిరిగా కాకుండా.. ఐదు కిలోల ఎల్పిజి సిలిండర్లను తెరపైకి తీసుకొచ్చింది.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధం ఏర్పడిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఐదు కిలోల సిలిండర్లను తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. వాటి తయారీనియుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. అమ్మకాలు కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మనదేశంలో ఐదు కిలోల చిన్న ఎల్పిజి సిలిండర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు 6.6 లక్షల సిలిండర్లను కేంద్రం విక్రయించింది. గుర్తింపు పత్రాలను చూపిస్తే.. ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు ఈ సిలిండర్లను అందిస్తున్నారు.
ఈ సిలిండర్లను విక్రయించి ప్రభుత్వం కాస్తలో కాస్త వినియోగదారుల నుంచి ఒత్తిడి తగ్గించుకుంది. అంతేకాదు వినియోగదారుల అవసరాలు సాధ్యమైనంత వరకు తీర్చింది. అయితే హార్ము జ్ జల సంధి నుంచి రాకపోకలు మొదలవుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. గ్యాస్ కష్టాలు తీరుతాయని కేంద్ర భావిస్తున్నది. చమురు అవసరాలు కూడా తీరిపోతాయని అంచనా వేస్తోంది. ఏది ఏమైనప్పటికీ అవసరాల నుంచి ఆవిష్కరణలు పుడతాయని.. ఆ ఆవిష్కరణలు మనిషి జీవితాన్ని సుఖవంతం చేస్తాయని ఒక నానుడి ఉంది. అది ఇప్పుడు ఈ ఐదు కిలోల ఎల్పీజీ సిలిండర్ల తయారీ ద్వారా నిజమైంది.