
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 9న మరో విడత చర్చలు జరుపనున్నది. శనివారం జరిగిన ఐదో విడత చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తుండగా సవరణలకు కేంద్రం మొగ్గుచూపుతున్నది. ఈ నేపథ్యంలో చర్చల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఒక ప్రతిపాదనను పంపుతామని కేంద్ర ప్రభుత్వం తమకు తెలిపిందని చర్చల అనంతరం రైతు సంఘాల నేతలు చెప్పారు. ఆ ప్రతిపాదనపై తమతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాత ఈ నెల 9న ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్రం వెల్లడించిందని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపైనా చర్చ జరిగిందని, అయితే చట్టాలను వెనక్కి తీసుకునే అంశంపై మాట్లాడాలని తాము చెప్పినట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికైత్ తెలిపారు.