China research espionage India : చైనా అంటేనే కన్నింగ్ దేశం.. డూప్లికేట్ దేశం.. తాను శత్రువుగా భావించే దేశాల రహస్యాలు తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. తాను ఎగముతి చేసే వస్తువులు, యాప్ల ద్వారా కూడా రహస్యంగా సమాచారం సేకరిస్తుంది. అందుకే చైనా వస్తువులను చాలా దేశాలు నిషేధిస్తున్నాయి. భారత్లో గాల్వన్ ఘటన తర్వాత చైనా యాప్స్ నిషేధించింది. అయితే తాజాగా చైనా భారత రహస్యాలు తెలుసుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తోంది. భారత యూనివర్సిటీలను సంప్రదిస్తోంది. స్కాలర్స్ సాయం కోరుతోంది. రిటైర్డ్ ఆర్మీ, నేవీ అధికారులను సంప్రదిస్తోంది. తమకు పరిశోధనలకు సంబంధించిన వివరాలు కావాలని, తాము విద్యార్థులమని పేర్కొంటోంది. దీంతో యూజీసీ అలర్ట్ అయింది. చైనా యూనివర్సిటీలు, చైనా మూలాలు ఉన్న సంస్థలు, ఎన్జీవీ లేదా హాంకాంగ్ సంస్థల రూపంలో కనిపించే భాగస్వామ్యాలతో జరిగే పరిశోధనలపై జారీ చేసిన హెచ్చరికలు చేసింది. భారత విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు, స్కాలర్స్ అత్యంత జాగ్రత్తగా ఉండి, చైనాతో కొలాబరేషన్ ఎలాంటి రూపంలోనైనా ఉంటే దాని వెనుక ఉన్న భద్రతా పరిణామాలను గుర్తించాలని స్పష్టంగా సూచించింది.
చిన్న గ్రాంట్, పెద్ద ‘‘డేటా డ్రాగ్’’
చైనా సంబంధిత సంస్థలు ఎన్జీవీలు, హాంకాంగ్ సంస్థలు రూపంలో భారత రీసెర్చ్ స్కాలర్స్ను 500 డాలర్ల చిన్న ప్రాజెక్టులతో ఆకర్షిస్తున్నాయి. మొదట భారత్–చైనా సంబంధాలు, పశ్చిమాసియా సంబంధాలు, సముద్ర జలాలు వంటి సాధారణ అంశాలుగా కనిపించే ప్రాజెక్టులుగా మొదలై, తర్వాత రక్షణ వ్యూహాలు, ఆయుధ కొనుగోలు విధానాలు, హిందూ మహా సముద్రం, మలక్క, హర్మూజ్ జలసంధుల వంటి వ్యూహాత్మక ప్రాంతాలపై వివరాలు తెలుసుకునే కీలక ప్రశ్నలకు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇది చైనా సంప్రదాయిక పరిశోధన కాకుండా యుద్ధపరమైన ప్రయోజనాల కోసం సమాచారం సేకరించే వ్యూహాన్ని సూచిస్తుంది.
దిలీప్ గర్గ్ చొరవతో వెలుగులోకి..
అండమాన్ నికోబార్లో నేవీలో పనిచేస్తున్న దిలీప్ గర్గ్ ఘటన ఈ వ్యూహాన్ని బహిరంగమైన ఉదాహరణగా ప్రదర్శిస్తోంది. హాంకాంగ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్న వ్యక్తులు ‘‘సాగర్ జలాల గురించిన పరిశోధన’’ అని పేరు చెప్పి ఆయనను సంప్రదించారు. వారి వెబ్సైట్ వివరాలు అడిగితే ఇచ్చిన లింక్ ప్రస్తుతం పనిచేయడం లేకపోవడం, సమాధానాలు ఇవ్వకపోవడం వంటి విషయాలు ఆ సంస్థ యొక్క అస్పష్టతను బహిరంగం చేశాయి. దిలీప్ గర్గ్ వెంటనే కేంద్ర భద్రతా సంస్థలకు సమాచారం చేరవేయడం ఈ ప్రక్రియ కేవలం అకడమిక్ కాదనే సందేహాన్ని బలపరుస్తుంది.
ఆర్మీ, యూనివర్సిటీలు లక్ష్యంగా..
ఆర్మీ ఆఫీసర్లు, మాజీ అధికారులు ఇప్పటికే చైనా ద్వారా ‘‘స్పై నెట్వర్క్’’ లక్ష్యంగా మార్చబడిన చరిత్ర అమెరికాలో రుజువైంది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను చిన్న గ్రాంట్లు, పరిశోధన ప్రాజెక్టులు, జర్నల్ పేపర్లు అనే పేర్లతో సంప్రదించి రహస్య సమాచారం సేకరించిన కేసులు అమెరికాలో గుర్తించబడ్డాయి. ఇప్పుడు అదే తరహా వ్యూహం భారత్లోకి విస్తరిస్తోందనే భావన ఉంది. యూనివర్సిటీ అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చైనా నుంచి వచ్చిన సంస్థల ద్వారా లక్ష్యంగా మార్చబడుతున్నారని సమాచారం.
అమెరికా ఈ రకమైన చైనా స్పై కేసులను బహిరంగంగా తీసుకుని జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్, ఆర్మీ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లే, ఇప్పుడు యూజీసీ కూడా అదే దిశలో కఠిన మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. చైనాతో, లేదా చైనా మూలాలు ఉన్న సంస్థలతో కొలాబరేషన్ అన్నదీ కేవలం ‘‘ఒక ప్రాజెక్టు’’ కాదని, దానిలో రహస్య సమాచారం, సైనిక వ్యూహాలు, ఆయుధ ప్రణాళికలు ఉండి ఉంటే దానికి ప్రత్యేక భద్రతా అనుమతి అవసరమని స్పష్టం చేస్తోంది.
