
సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల సమావేశం రద్దయింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శనివారం ఈ సమావేశం జరగాల్సి ఉంది. తాలిబన్ల ఆధీనంలోని అఫ్గానిస్తాన్ కు ఈ సమావేశంలో ప్రాతినిధ్యం కల్పించాలని పాక్ పట్టబట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై భారత్ సహా మరికొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సభ్య దేశాల మద్య ఏకాభ్రిప్రాయం కుదరకపోవడంతో ఈ సమావేశం రద్దయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో భాగంగా ఏటా ఈ సమావేశాలు జరుగుతాయి. ఇదిలా ఉండగా అమెరికా సేవల నిష్ర్కమణతో అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. భారత్ సహా చాలా దేశాలు ఆ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించలేదు.
అలాగే కేబినేట్ మంత్రులుగా ఎంపికైన పలువురు తాబిబన్ నేతలు ఐరాస నిషేధిత జాబితాలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో మాట్లాడుతూ అఫ్గాన్ లో ఏర్పడింది సమ్మిళిత ప్రభుత్వం కాదన్నారు. తాలిబన్ల పాలనను అంగీకరించడానికి ముందు ప్రపంచ దేశాలు ఆలోచించాలని పేర్కొన్నారు.
సార్క్ అనేది దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం. భారత్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, భూటన్ ఇందులో సభ్య దేశాలు, మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం ఇక్కడే ఉంది. అయితే భారత్, పాక్ మద్య ఉద్రిక్తతలు సార్క్ సమావేశాలపై ప్రభావం చూపుతున్నాయి.