Greater Visakhapatnam Elections 2026: సాధారణంగా ఉత్తరాంధ్ర ( North Andhra )అంటే తెలుగుదేశం పార్టీ అధిపత్యముంటుంది. ఒకటి రెండు సార్లు తప్పించి ఆ పార్టీదే హవా. విశాఖ నగరం గురించి చెప్పనవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి ఆ నగరం కంచుకోట. కానీ ఒక విషయంలో మాత్రం తీరని లోటు. గ్రేటర్ విశాఖపట్నం మాత్రం ఆ పార్టీకి చిక్కలేదు. అప్పుడెప్పుడో ఐదేళ్లపాటు మాత్రం ఆ పార్టీ గ్రేటర్ విశాఖ ను ఏలింది. కానీ తరువాత మాత్రం చిక్కలేదు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవిని స్వాధీనం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. అయితే టిడిపి తో పాటు మిత్రపక్షాలైన జనసేన, బిజెపి సైతం విశాఖపట్నం పీఠాన్ని ఆశిస్తున్నాయి. ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.
* అతిపెద్ద కార్పొరేషన్..
రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం( Visakhapatnam). 98 డివిజన్లతో గ్రేటర్ విశాఖ ఉంది. అయితే శివారు ప్రాంతాలను కలుపుతూ 150 డివిజన్లుగా మార్చాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా భీమిలి, అనకాపల్లిలోని గ్రామీణ మండలాలను కూడా కలుపుతారని ఎప్పటినుంచో టాక్ ఉంది. ఇవన్నీ జీవీఎంసీలో కలిస్తే మరో 25 డివిజన్లు పెరుగుతాయి. జీవీఎంసీని 150 వార్డులుగా పెంచాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఈ డివిజన్ల చేర్పుల ప్రక్రియ అంత ఈజీగా తేలేలా లేదు. మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
* ఎవరికివారుగా..
ఇటీవల అవిశ్వాసం పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవిని అందుకుంది టిడిపి. మరోసారి ఆ పదవిని చేజిక్కించుకోవడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమిలో అప్పుడే చర్చ ప్రారంభం అయింది. విశాఖ తొలి మేయర్ పీఠం బిజెపి దక్కించుకుంది. 1987లో టిడిపి గెలిచింది. 1995, 2005,2007 లో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2021 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసిపి మేయర్ పిఠాన్ని దక్కించుకుంది. నాలుగేళ్లపాటు మేయర్ గా వైసీపీకి చెందిన హరి వెంకట కుమారి కొనసాగారు. గత ఏడాది ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్ రావు మేయర్ అయ్యారు. ఏడాది మార్చుతో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం పూర్తి కానుంది.
* యాదవ సామాజిక వర్గం డిమాండ్..
విశాఖ నగరంలో యాదవ సామాజిక వర్గం అధికం. ఆ సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలోనే యాదవ వర్గానికి చెందిన హరి కుమారిని నియమించింది. అయితే ఇప్పుడు ఆమెను తొలగించి శ్రీనివాసరావు అయ్యారు మేయర్ గా. ఈసారి మాత్రం యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి మేయర్ పదవి కట్ట పెట్టాలన్న డిమాండ్ టిడిపి నుంచి వినిపిస్తోంది. ఇంకోవైపు కాపులు, మత్స్యకారులు, నాగవంశీయులు కూడా మేయర్ పీఠానికి పోటీ పడుతున్నారు.. జనసేన సైతం ఇక్కడ మేయర్ పీఠాన్ని ఆశిస్తోంది. బిజెపికి సైతం విశాఖ నగరంలో బలం ఉంది. దీంతో మేయర్ పదవిని రెండున్నర ఏళ్ల పాటు పంచాలని.. డిప్యూటీ మేయర్ పదవులను మూడు పార్టీలు సమానంగా పంచుకోవాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. చూడాలి గ్రేటర్ విషయంలో కూటమి ఎలా ముందుకు వెళ్తుందో..