ఎప్పుడూ లేని విధంగా ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా ఏంటో చాటింది. గత ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన కార్పొరేటర్ల సంఖ్య.. ఈసారి డబుల్ డిజిట్ కాదు ఏకంగా 48 మందిని గెలుచుకుంది. టీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చిందనే చెప్పాలి. అయితే.. గ్రేటర్ ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు గడిచిపోతున్నా.. ఇంత వరకూ గెలిచిన కార్పొరేటర్లను తెలంగాణ ఎన్నికల సంఘం నోటిఫై చేయలేదు. దీంతో ఏదో కుట్ర జరుగుతోందని బీజేపీ అనుమానిస్తోంది. తక్షణం గెలిచిన కార్పొరేటర్లను నోటిఫై చేయకపోతే కోర్టుకెళ్తామని.. ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Also Read: సాగర్లో బీజేపీ వ్యూహం అదేనా?
ఆ వెంటనే ఎస్ఈసీ పార్థసారథిని కూడా కలిశారు. వెంటనే నోటిఫై చేయాలని వినతిపత్రం కూడా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఈ సారి ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ దక్కలేదు. అధికార టీఆర్ఎస్కు 55 డివిజన్లు రాగా.. ఎంఐఎంకు ఎప్పటిలాగే 44 సీట్లను గెలుచుకుంది. అయితే.. మేయర్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 75 కాగా.. ఇప్పుడు ఆ మెజార్టీ ఏ పార్టీకీ లేదు. మామూలుగా టీఆర్ఎస్ కు పూర్తిస్థాయిలో మెజార్టీ వచ్చి ఉంటే.. ఈ పాటికి కొత్త మేయర్ కొలువుదీరి ఉండేవారు. కానీ.. ప్రస్తుత పాలక వర్గానికి ఫిబ్రవరి వరకూ గడువు ఉందంటూ.. ఎన్నికైన కార్పొరేటర్లను ఖాళీగా ఉంచుతున్నారు.
కేసీఆర్ తెర వెనుక ఏదో ప్రణాళిక అమలు చేస్తున్నారన్న అనుమానానికి బీజేపీ నేతలకు వస్తున్నాయి. అందుకే.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతగా సమయం ఉందనుకుంటే.. ముందుగా ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నిస్తున్నారు. గవర్నర్ను కూడా కలుస్తామని ప్రకటించారు. సాధారణంగా ముందస్తుగా ఎన్నికలు జరిగి.. మ్యాండేట్ వ్యతిరేకంగా వచ్చిందని తెలిస్తే ఆ ప్రభుత్వం బాధ్యతల నుంచి వైదొలుగుతుంది. అయితే.. గ్రేటర్లో మాత్రం అలాంటి ఆలోచన చేయడం లేదు.
Also Read: ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆటకట్టించిన పోలీసులు
మరోవైపు గ్రేటర్ మేయర్ పీఠాన్ని వదులుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. ఎలాగైనా పీఠం దక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడమో.. లేదా.. మళ్లీ ఎన్నికలు పెట్టే ఆలోచనలోనో కేసీఆర్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికైన కార్పొరేటర్లను వీలైనంత త్వరగా నోటిఫై చేయించాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ప్రభుత్వ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎస్ఈసీ కూడా ఒకవిధంగా ప్రభుత్వం చెప్పినట్లే వింటున్నారని ప్రతిపక్షాల ఆరోపణ మరి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్