Congress-TRS Alliance : తెలంగాణ రాజకీయాల్లో ఇది అనుకోని అనూహ్యమైన కుదుపుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు బద్ద విరోధులను ఈ పొత్తు పొడుపులు కలుపుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న చందంగా రాజకీయాలు మారుతున్నాయి.
-కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ రహస్య మంతనాలు?
గత వారం రోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వరుసగా సమావేశమవుతూ ఆ పార్టీలో చేరి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహాలను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఒకరోజంతా ప్రగతి భవన్ లోనే విడిది చేసి మరీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపు కుదిపింది. సోనియాను కలిసి వచ్చి కేసీఆర్ తో పీకే రహస్య చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ దోస్తీ చేయడం.. భవిష్యత్తులో కాంగ్రెస్ కు మద్దతిచ్చేలా టీఆర్ఎస్ ను ఒప్పించేందుకే పీకే రంగంలోకి దిగారని తెలుస్తోంది. బీజేపీ అంటేనే మండిపడుతున్న కేసీఆర్ కు ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ కల సాకారమయ్యేలా కనిపించడం లేదు. చాలా పార్టీలు కాంగ్రెస్ తోనే ఉన్నాయి. సో ఆయన కూడా కాంగ్రెస్ తో కలవడం తప్ప మరో ఆప్షన్ సమీప రాజకీయాల్లో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే కేసీఆర్-పీకే మంతనాలు దీనిపై ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
-పీకే తలుచుకుంటే ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ కే మద్దతు?
దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తలుచుకుంటే దేశంలోని ప్రాంతీయ పార్టీల మద్దతును అంతా కూడగట్టి ఏకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇప్పించగలడు. కేంద్రంలో బీజేపీకి సరైన మెజార్టీ రాకుంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగల సత్తా పీకే సొంతం. ఎందుకంటే ఇప్పటికే పీకే తమిళనాడులో డీఎంకేను, ఏపీలో జగన్ ను, బెంగాల్ లో మమతను, ఢిల్లీలో కేజ్రీవాల్ సహా ఎంతో మంది ప్రాంతీయ పార్టీలను గెలిపించాడు.తాజాగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనూ కలిసి పనిచేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల నేతలతోనూ టచ్ లో ఉన్నారు. వారితో బలమైన బంధం సాన్నిహిత్యం ఉంది. ఈ పరిచయాలతోనే పీకేకు గొప్ప బలంగా ఉన్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలన్నింటిని కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా చేయడం పీకేకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే అటు కాంగ్రెస్ ను ఇటు ప్రాంతీయపార్టీలను ఒకే గాటిన కట్టడానికి పీకే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో గొప్ప మార్పును మనం ఊహించవచ్చు.
-కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలిస్తే.. రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏంటి?
కాంగ్రెస్ తో టీఆర్ఎస్ ను కలిపేందుకే పీకే మంతనాలు జరుపుతున్నారని టాక్. ఇప్పటికే ఏపీలో జగన్ తోనూ పీకే టచ్ లో ఉన్నారు. ఇలా చాలామంది నేతలను కాంగ్రెస్ కు దగ్గరకు చేయగలడు. ఇదే ఊపులో టీఆర్ఎస్ తోనూ తాజాగా పీకే సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇవి కార్యరూపం దాల్చితే టీఆర్ఎస్ -కాంగ్రెస్ బంధం బలపడుతుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఈ కూటమి రాష్ట్ర,జాతీయ స్థాయిలో నిలబడుతుంది. ఇదే జరిగితే కేసీఆర్ అన్నా.. టీఆర్ఎస్ అన్నా ఒంటికాలిపై లేచే.. శత్రువుగా భావించే రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
-చంద్రబాబే కలిశాడు.. రేవంత్ ఒక లెక్కనా?
తెలంగాణ, ఏపీ విడిపోయిన వేళ మీడియాతో, ఏపీ ప్రభుత్వంతో నాడు కేసీఆర్ ను తెగ ఇబ్బంది పెట్టారు నాడు సీఎంగా చేసిన చంద్రబాబు. ఈ క్రమంలోనే ఓటుకు నోటుతో చంద్రబాబును ఏపీకి సాగనంపి ఆయన నోరు మూయించిన ఘనత కేసీఆర్ దే. కేసీఆర్ తనకు అంత డ్యామేజ్ చేసినా కూడా రాజకీయాల కోసం మళ్లీ కేసీఆర్ గడప తొక్కి రాజీ చేసుకున్నారు చంద్రబాబు. స్వయంగా ప్రగతి భవన్ వచ్చి తన శిష్యుడైన కేసీఆర్ ను బతిమాలో బామాలో ఆ కేసును ఇప్పుడు ఎటూ కాకుండా నీరు గార్చడన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కేసీఆర్ వల్ల రాజకీయంగా.. వ్యక్తిగతంగా ఎంతో ఇబ్బంది పడి జైలుకు కూడా వెళ్లిన రేవంత్ రెడ్డి కలుస్తాడా? అన్నది ప్రశ్న. కేసీఆర్ తో నాడు స్నేహంగా ఉన్న బీజేపీని కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరాడు రేవంత్. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ అయ్యాడు. కేసీఆర్ పై ఒంటికాలిపై లేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు టీఆర్ఎస్ తో వెళ్లేందుకు సిద్ధమైంది. మరి పాతపగలన్నీ మరిచి తన బాస్ చంద్రబాబులా రేవంత్ రెడ్డి కూడా మనసు చంపుకొని కేసీఆర్ తో కలుస్తాడా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది..
-కేసీఆర్, రేవంత్ కలుస్తారా? కాంగ్రెస్ ను రేవంత్ ఔట్ అవుతాడా?
కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి సాగితే రేవంత్ రెడ్డికి రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ తో కలిసి సాగడం.. లేదంటే నచ్చకపోతే కాంగ్రెస్ ను వీడి వెళ్లడం.. ఈ రెండూ కాదనకుంటే కేసీఆర్ సైతం తనకు బద్ధ శత్రువైన రేవంత్ రెడ్డిని తొలగిస్తేనే కాంగ్రెస్ తో కలుస్తానని మెలికపెట్టవచ్చు. ఈ రకంగానూ రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు రావచ్చు. ఎలా చూసుకున్నా కాంప్రమైజ్ అయితే కేసీఆర్, రేవంత్ కలుస్తారు? ఏ ఒక్కరూ వ్యతిరేకించినా కూడా పోయేది రేవంత్ రెడ్డి పీసీసీ పోస్ట్ నే. అందుకే కాంగ్రెస్-టీఆర్ఎస్ కలయిక తెలంగాణ రాజకీయాలనే కాదు.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలదు. బీజేపీకి ప్రత్యామ్మాయ శక్తిగా నిలబడగలదు.కానీ ఇందులో పాపం రేవంత్ రెడ్డి భవిష్యత్తే కాస్త గందరగోళంలో పడడం ఖాయంగా కనిపిస్తోంది.
Recommended Videos
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What is the future of revanth reddy if congress trs pact
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com