Homeజాతీయ వార్తలుRevanth Reddy: అటు నుంచి నరుక్కొస్తున్న రేవంత్‌!

Revanth Reddy: అటు నుంచి నరుక్కొస్తున్న రేవంత్‌!

Revanth Reddy: ఓ మాజీ కాంగ్రెస్‌ నాయకుని కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొత్త వ్యూహం పన్నారు. అటు టీఆర్‌ఎస్‌ను, ఇటు బీజేపీని ఇరుకున పెట్టేలా ప్లాన్‌ చేస్తున్నారు. మళ్లీ పార్టీ జవసత్వాలు పోసుకునేలా ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. మాజీ కాంగ్రెస్‌ నేత ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌(డీఎస్‌)ను ఎలాగైనా తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ పాత లీడర్లు కాంగ్రెస్‌లోకి ‘ఘర్‌వాపసీ’ కోసం ఎదరుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కోవలో అటు టీఆర్‌ఎస్‌ లేకుండా, ఇటు బీజేపీలో చేరకుండా మిగిలిపోయి ఉన్న డీఎస్‌ను ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.

Revanth Reddy
Revanth Reddy, D Srinivas

కాంగ్రెస్‌లో వ్యక్తిగత ప్రజాస్వామ్యం ఎక్కువని చాలా సందర్భాల్లో విశ్లేషకులు చెబుతుంటారు. ఈ కారణం చేతనే పార్టీ సీనియర్ల మధ్య అనేకసార్లు విభేధాలు బయటపడ్డాయి. మరికొందరైతే అధికార పార్టీకి వంతపాడుతూ పలు సందర్భాల్లో పత్రికా ప్రకటనలు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి కారణాల చేతనే కాంగ్రెస్‌ కొన్నేండ్లుగా చతికిల పడింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను ప్రకటించిన అనంతరం పార్టీలో కొత్త హుషారు రేకెత్తింది. రేవంత్‌ పట్ల అభిమానంతోనూ యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రేవంత్‌ ముందుకు దూసుకెళ్తున్నారు. అధికార పార్టీని అడుగడుగునా ఎండగడుతూ సభలు నిర్వహిస్తూన్నారు. ర్యాలీలు, సమావేశాలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

ds and sons
DS and Sons

ఈ నేపథ్యంలోనే పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలో కొత్త నాయకత్వానికి ఊతమిస్తూనే పాత నాయకులను కలుపుకుపోయే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరారు. మరికొంత మంది నేతలు కూడా రేవంత్‌తో కలిసి పని చేసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే మాజీ కాంగ్రెస్‌ నేత ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ (డీఎస్‌) కుమారుడు సంజరు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల డీఎస్‌ను పరామర్శించేందుకు రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికెళ్లారు. పత్రికా ముఖంగా ఆరోగ్య పరిస్థితులను అడిగేందుకే వెళ్లానని చెప్పినా తెరవెనుక వేరే మంత్రాంగం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన్ని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్‌ను కలిసిన డీఎస్‌ కొడుకు ధర్మపురి సంజరు కాంగ్రెస్‌లో చేరాలనే ఆసక్తిని బయటపెట్టారు. అందుకు రేవంత్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ సంజరు పార్టీలో చేరే విషయంలో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు అసంత ప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా మంచి ట్రాక్‌ రికార్డు లేని సంజరును పార్టీలో చేర్చుకోవడం సరికాదని వాళ్లు అధిష్ఠానం ద ష్టికి తీసుకెళ్లారని సమాచారం. దీంతో సంజరును పార్టీలో చేర్చుకునే విషయాన్ని వాయిదా వేయాలని రేవంత్‌కు హైకమాండ్‌ సూచించినట్లు తెలిసింది.

అయినా పట్టువదలని విక్రమార్కునిలా రేవంత్‌ సంజరుని ఎలాగైనా పార్టీలో చేర్చుకునేందుకు ఓ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ముందుకు డీఎస్‌ను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని, అటు తర్వాత సంజరుని కూడా వెంటనే పార్టీలో చేర్చుకోవచ్చని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. డీఎస్‌ రాకతో ఇటు బీజేపీనీ అటు టీఆర్‌ఎస్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాలని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న డీఎస్‌.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. కానీ టీఆర్‌ఎస్‌లో ఆయనకు ఇప్పుడు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో ఆయన్ని తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకు వస్తే బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన రెండో కుమారుడు అరవింద్‌కు కూడా చెక్‌ చెప్పినట్లు అవుతుందని రేవంత్‌ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. రేవంత్‌ వ్యూహం ఏ మేరకు పని చేస్తుందో మరి! వేచి చూద్దాం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular