
తిరుపతి ఉప ఎన్నిక వేళ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ రాజకీయాలను షేక్ చేసే లేఖ రాశారు. చంద్రబాబు ప్రత్యర్థి అయిన ఏపీ సీఎం జగన్ కు సోము వీర్రాజు రాసిన లేఖ సంచలనమైంది. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇరికించేశారు. ఇటు అధికార పార్టీ జగన్ ను దీనిపై స్పందించాలని ఇరకాటంలో పడేశాడు.
తాజాగా సోము వీర్రాజు.. ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు హయాంలోని స్కాంపై లేఖ రాశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన వైద్య పరికరాల కుంభకోణం కేసు విచారణ వేగంగా పూర్తి చేసి దోషులను పట్టుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన భారీ స్కామ్ పై సీఐడీ కేసును వేగంగా , నిష్పక్షపాతంగా విచారించి దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సోము వీర్రాజు కోరారు.
*చంద్రబాబు హయాంలో జరిగిన స్కాం ఇదీ
2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణకు ఏపీఎంఎస్ఐ డీసీ ద్వారా టెండర్లు పిలిచింది. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియన్ టెలీ మాటిక్, బయో మెడికల్ సర్వీసెస్ అనే సంస్థకు టెండరు ఖరారు చేసింది. ఈ టెండరు ఖరారులో అవకతవకలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు టెండర్లు ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. టెండర్ దక్కించుకున్న సంస్థ ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే ఎన్నో రెట్లు అమాంతం పెంచేసి మోసానికి పాల్పడింది. ఏడాదికి రూ.450 కోట్ల భారీ మొత్తానికి టెండరు కట్టబెట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాన్ని పొడిగించారని తెలిసింది. వెంటిలేటర్ పై రూ.7.10 లక్షలుంటే దాన్ని రూ.11 లక్షలుగా పెంచి 159 వెంటిలేటర్లు సరఫరా చేశారు.
రూ.840 విలువ చేసే ఒక్కో గ్లూకో మీటరును రూ.5.08 లక్షలుగా ధరపెంచి 12 గ్లూకో మీటర్ల కొనుగోలు చేశారు. మొత్తంగా 300 కోట్లు విలువ చేసే ఉపకరణాల విలువను రూ.500 కోట్లుగా చూపించినట్లు సమాచారం. ఈ అవినీతిలో రూ.200 కోట్ల మేర చేతులు మారాయంటున్నారు.
ఇప్పటికే ఈ కేసులో జగన్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. ఇదే కేసులో నాటి ఈఎస్ఐ శాఖ చూసిన అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసింది. సీఐడీ ఈ కేసు విచారణను వేగంగా పూర్తి చేసి అసలైన దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సోమువీర్రాజు లేఖ రాశారు. దీంతో ఈ లేఖ చంద్రబాబును టార్గెట్ చేసిందేనన్న చర్చ సాగుతోంది. జగన్ కనుక ఈ లేఖపై స్పందిస్తే చంద్రబాబుకు చిక్కులు తప్పవు అని అంటున్నారు.