Homeఆంధ్రప్రదేశ్‌Y S R Aarogyasri: వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.600 కోట్ల బకాయిలు.. సేవలు నిలిపివేస్తున్న నెట్...

Y S R Aarogyasri: వైఎస్సార్ ఆరోగ్యశ్రీకి రూ.600 కోట్ల బకాయిలు.. సేవలు నిలిపివేస్తున్న నెట్ వర్క్ ఆస్పత్రులు

Y S R Aarogyasri: పేదల వైద్యానికి మాది భరోసా అన్నారు. వారి కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువేనన్నారు. రూ.1000 ఖర్చు దాటిన ఎలాంటి వైద్య చికిత్సకైనా ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నా తండ్రి మానస పుత్రిక ఆరోగ్య శ్రీగా చెప్పుకొచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు మాటలు కోట దాటించారు… తీరా అధికారంలోకి వచ్చాక చేతలు మాత్రం గడప దాటడం లేదు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని చెబుతూనే… ఆరోగ్యశ్రీ ఆయువు తీసేశారు. అటకెక్కించేశారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడే వైద్యసేవలు నిలిచిపోతున్నాయి. రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులకు ప్రభుత్వ విధానాలే కారణమని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 874 ప్రయివేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటికి ప్రభుత్వం రూ.520 కోట్ల బకాయిలు పడింది. ఈ ఆస్పత్రులకు నాలుగు నెలల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఇవి కాకుండా మరో రూ.80 కోట్ల బిల్లులు సీఎ్‌ఫఎంఎ్‌సలోకి అప్‌లోడ్‌ కావాల్సి ఉంది. దాదాపు రూ.600 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల వరకూ ప్రభుత్వం బకాయిలు పండింది. ఈ నిధులు ఎప్పుడు చెల్లిస్తారు? అసలు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ వద్ద సమాధానం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులు మొత్తం చేతులెత్తేశాయి. వైద్యం ఖర్చు రూ.1000 కాదు.. లక్ష దాటినా ఆరోగ్యశ్రీలో చేర్చుకోవడం లేదు. ఇష్టం ఉంటే వైద్యం చేయించుకోండి.. లేకుంటే వెళ్లిపోండి అంటూ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులకు తేల్చిచెబుతున్నాయి. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది.

Y S R Aarogyasri
Y S R Aarogyasri

Also Read: National Family Health Survey: భార్యలను కొట్టే భర్తల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానం!

ప్యాకేజీల ఊసేలేదు

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 1054 రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్యను సుమారు 2490కి పెంచారు. అయితే అందుకు అనుగుణంగా ప్యాకేజీలు పెంచలేదు. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ ప్యాకేజీల విషయంలో ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. సీపీఐ నామ్స్‌ ప్రకారం ప్యాకేజీలు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ కొత్త ప్రభుత్వం ఇప్పటికూ ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సల ప్యాకేజీల విషయంపై దృష్టిపెట్ట లేదు. ప్యాకేజీలు పెరగకపోవడంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 2490 శస్త్ర చికిత్సలు చేయడానికి ముందుకు రావడం లేదు. వారికి ఆదాయం వచ్చే శస్త్ర చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. మిగిలిన శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావని రోగులను బయటకు పంపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా సక్రమంగా నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయుష్మాన్‌ భారత్‌ నిధులే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పెద్ద అండగా నిలుస్తున్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.200 కోట్ల పైన బకాయిలు పడితే వెంటనే ట్రస్ట్‌ అధికారులు ఆయుష్మాన్‌ భారత్‌ నిధులను కూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారుల తప్పిదం వల్ల ఆయుష్మాన్‌ భారత్‌ నిధులు కూడా నిలిచిపోయ్యాయి. పేమెంట్‌ జరగడం లేదు. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు గగ్గోలు పెడుతున్నాయి.

Also Read: Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మనసు మార్చుకుంటారా? వైసీపీ పెద్దల ప్రయత్నాలు ఫలించేనా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular