
తెలంగాణలో వర్షాలు మే నెలలోనే ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు (బుధవారం) నుంచి వరుసగా 4 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అండమాన్ దగ్గర అల్పపీడనం ఏర్పడేలా ఉంది కాబట్టి… దాని ప్రభావం తెలంగాణ పైనా పడనుంది. ఐతే… ప్రస్తుతం తెలంగాణలో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి.
మెదక్ లో మంగళవారం 42.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 41.2, హైదరాబాద్ లో 37.6 డిగ్రీలు నమోదైంది. సాధారణంగా హైదరాబాద్ కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. దానికి తోడు రాజధానిలో లో మంగళవారం అక్కడక్కడా వర్షం కూడా పడింది.
ఇక ఏపీలోనూ వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయల సీమలో అక్కడక్కడా వానలు పడేలా కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావం వల్ల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలోకి వెళ్తుందని చెప్పారు. దానికి తోడు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని విదర్భ పైనుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతోంది. దాని వల్ల అక్కడక్కడా మేఘాలు అలా అలా గాల్లో తేలుతూ… అటూ ఇటూ వెళ్తున్నాయి. ఇవన్నీ వర్షాలు పడేందుకు ఛాన్స్ ఇవ్వబోతున్నాయి. ఐతే… ప్రస్తుతానికి ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వానలు పడుతున్నాయి.