Pawan Kalyan – Chandrababu : ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి పవన్ కీలక చర్చలు జరపడం హాట్ టాపిక్ గామారింది. గత కొద్దిరోజులుగా టీడీపీ, జనసేన మధ్య పొత్తుల అంశం దోబూచులాడుతూ వస్తోంది. దీనిపై క్లారిటీ లేకున్నా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఇరు పార్టీల శ్రేణులు ఒక అంచనాకు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. విశాఖలో పవన్ ను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో అప్పట్లో చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. విజయవాడలో ఓ హోటల్లో బస చేస్తున్న పవన్ ను చంద్రబాబు స్వయంగా కలిశారు. జీవో 1ను సాకుగా చూపి చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీసులు అడ్డగించిన నేపథ్యంలో పవన్ నేరుగా చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జగన్ సర్కారు ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ జీవోను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలను నిషేధించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును కుప్పంలో పోలీసులు అడ్డగించారు. దీనిపై చంద్రబాబు ఘాటుగానే రియాక్టయ్యారు. విపక్షాలను అణచివేసేందుకే జీవో తెచ్చారని ఆరోపించారు. అయితే గతంలో తనను విశాఖలో పోలీసులు అడ్డగించినప్పుడు చంద్రబాబు సంఘీభావం ప్రకటించిన నేపథ్యంలో.. పవన్ కూడా ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరించినట్టయ్యింది. చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ సంఘీభావం తెలపడంతో రెండు పార్టీల మధ్య బంధం మరింత గట్టిపడింది. అయితే ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, అధికార పక్షం దూకుడు, విపక్షాలు అనుసరించాల్సిన వ్యూహం, పొత్తుల అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా జీవో 1కు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటానికి ఇరువురు నేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జగన్ దమనకాండకు చెక్ చెబుతామని.. అవసరమైతే ఐక్య కార్యాచరణతో ముందుకెళతామని డిసైడైనట్టు సమాచారం.
పవన్ తాజా కదలికలతో జనసేన, టీడీపీల మధ్య పొత్తు ఖాయమని స్పష్టమైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆది నుంచి చంద్రబాబు పొత్తుల కోసం పడిగాపులు కాస్తున్నారు. పవన్ కోసం చేయని ప్రయత్నం లేదు. 2014 రిజల్ట్ ను రిపీట్ చేయాలన్న క్రమంలో జనసేన, బీజేపీని కలుపుకొని వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ మాత్రం తాము జనసేనతో మాత్రమే కలుస్తామని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని మోదీతో భేటీ తరువాత పవన్ వైఖరిలోమార్పు వచ్చింది. దీంతో టీడీపీ పొత్తుల విషయంలో అస్పష్ట వాతావరణం ఏర్పడింది. కానీ ఇప్పుడు పవన్ వచ్చి చంద్రబాబును కలవడంతో పొత్తు ఖాయమన్న సంకేతాలిచ్చినట్టయ్యింది. అటు బీజేపీ వైఖరిపై కూడా ఇరువురు మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పొత్తుల వ్యూహాలపై ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.
అటు ఇరుపార్టీలు చేపట్టబోయే కార్యక్రమాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లలో టీడీపీ నిమగ్నమైంది. మరోవైపు పవన్ కూడా బస్సుయాత్రకు సిద్ధపడుతున్నారు. వారాహి ప్రచార రథం సిద్ధమైంది. ఏ క్షణంలోనైనా బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. అయితే ఇరు పార్టీల కార్యక్రమాలు ఒకేసారి ప్రారంభం కానుండడంతో సక్సెస్ ఫుల్ గా చేపట్టాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ను గద్దెదించడమే ఈ ఇరువురు నేతల ముందున్న కర్తవ్యం. అందుకే పవన్ ఒక అడుగు ముందుకేశారు. అయితే పవన్ ను కలుపుకెళ్లాలన్న ప్రయత్నంలో చంద్రబాబు చాలా మెట్లు దిగారు. చాలారకాలుగా ప్రయత్నించారు. అయితే అవేవీ అంతగా వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు పవనే తనకు సంఘీభావం తెలపడానికి రావడంతో చంద్రబాబు హుషారుగాకనిపించారు. అటు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఒక రకమైన జోష్ కనిపిస్తోంది. ఇప్పుడు వారికి పవన్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. అయితే తాజా పరిణామాలను అధికార వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు టీడీపీ, జనసేన బంధంపై ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో పవన్ భేటీ అయిన నేపథ్యంలో విమర్శల డోసు పెంచే చాన్స్ ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan meet tdp chief chandrababu naidu in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com