NEET Exam Controversy: పదేపదే అదే తప్పు. అదే నిర్లక్ష్యం.. తప్పులు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం కూడా జరుగుతోంది. వ్యవస్థలో లోపాలు మాత్రం సవరించుకోవడం లేదు. సవరించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. వారిదేం పోయింది. తీరికగా ఏసీ గదుల్లో కూర్చుని ఒక ప్రకటన చేస్తారు. కానీ అంతిమంగా ఇబ్బంది పడాల్సింది విద్యార్థులు..
నీట్ పరీక్ష నిర్వహించే సమయంలో.. విద్యార్థులు కనీసం కుంకుమ బొట్టు పెట్టుకున్న సరే తొలగిస్తారు. పరీక్ష నిర్వహించే విధానంలో ఆ స్థాయిలో నిబద్ధత ఉన్నప్పుడు.. ప్రశ్న పత్రం బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోలేరా.. చివరికి చిన్న పిల్లాడికి వేసే డైపర్ కూడా లీక్ అవ్వడం లేదు కదా.. లక్షల కోట్ల వ్యవస్థ లో పనిచేస్తూ.. లక్షలకు పైగా జీతాలు తీసుకుంటూ.. పెద్ద పెద్ద చదువులు చదివినవారు కనీసం నీట్ పరీక్ష పత్రాన్ని లీక్ కాకుండా ఆపలేకపోయారంటే ఎంత నిర్లక్ష్యం ఉండాలి. ఎంత దారుణం ఉండాలి.
ఈనెల 3న దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. లక్షలాదిమంది విద్యార్థులు కోచింగ్ తీసుకొని.. డబ్బులు ఖర్చు పెట్టి పరీక్ష రాశారు. ఆ పరీక్షను పేపర్ లీక్ అయిందంటూ మంగళవారం రద్దు చేశారు. దీంతో పిల్లలు మళ్లీ చదవాలి. మళ్లీ పరీక్ష రాయాలి. ఈసారి పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీక్ కాదు అనే గ్యారెంటీ లేదు. మళ్లీ పరీక్ష రాయాలి.. మళ్లీ ఇబ్బంది పడాలి.. అసలు వ్యవస్థ ఇంత దారుణంగా మారితే.. పరీక్షలు నిర్వహించడం ఎందుకు.. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎందుకు.. డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎంబిబిఎస్ సీట్లు కొనుక్కోండి అంటూ ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది కదా. పరీక్షలు నిర్వహించడంలో విఫలమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని కేంద్రం కొనసాగించడంలో అర్థం ఎక్కడ ఉంది..
ఈసారి దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా నీట్ యూజీ పరీక్ష రాశారు. పరీక్ష రోజున దేశవ్యాప్తంగా విపరీతంగా హడావిడి జరిగింది. గేటు వద్ద విద్యార్థులకు అనేక రకాల శల్య పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆడపిల్లల ముక్కుపుడకలు కూడా తొలగించారు. కనీసం ఒక నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రానికి పంపించలేదు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు..5 జి జామర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశారు.. కానీ పరీక్ష పత్రాన్ని బయటకు వెళ్లకుండా ఆపలేకపోయారు. పరీక్ష పత్రం వాట్సాప్ ద్వారా చక్కర్లు కొట్టినా సరే.. మన వ్యవస్థ కనిపెట్టలేదంటే.. లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం గొప్పగా పరీక్ష నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఇంతవరకు అవినీతి లేకుండా నిర్వహించుకోలేకపోవడం అత్యంత బాధాకరం.. అప్పట్లో నీట్ పరీక్షను అందుబాటులో తీసుకొచ్చినప్పుడు.. “దేశ వ్యాప్తంగా 400 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 40 రకాల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆ పరీక్షలు రాసేందుకు దూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది సమస్యత్మకమవుతోంది. అందువల్లే నీట్ ను తీసుకొచ్చామని” దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అంతేకాదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెవెల్ లోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనిచేస్తుందని చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం లీకులు, మోసాలు.. మాయలు..
ఈ పరీక్ష ప్రారంభానికి ముందు దాదాపు 410 ప్రశ్నలు రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి. వీటిని ఊహాజనితమైన ప్రశ్నలు అని అన్నారు. కానీ అవే పరీక్షల్లో వచ్చాయి. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా.. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా.. మనదేశంలో విద్యారంగంలో కొన్ని మాఫియా శక్తులు ఏ స్థాయిలో తమ ప్రాబల్యాన్ని చూపిస్తున్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. లక్షల మంది జీవితాలతో ఆడుకునే ఆ ముఠాలను ప్రభుత్వాలు అరికట్ట లేవా.. వారిపై కఠిన చర్యలు తీసుకోలేవా.. చర్యలు తీసుకోనంతకాలం వాటి ఆటలు ఇలానే కొనసాగిపోతూనే ఉంటాయి.