Mango capital of India: ఉగాది పండుగ తర్వాత మార్కెట్లోకి మామిడి పండ్లు విరివిగా వస్తుంటాయి. కొన్ని రకాల పండ్లు ఎంతో తీయదనాన్ని అందిస్తాయి. వీటిని తింటే ఎక్కడా లేని అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో 1500 కంటే ఎక్కువ రకాలు కలిగిన మామిడి పండ్లు సాగవుతున్నాయి. అయితే వీటిలో బంగినపల్లి, తోతాపూరి, దాసరి, లాంగ్రా, కేసరి వంటి పండ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే భారతదేశం వ్యాప్తంగా ఒక నగరాన్ని మామిడి పండ్ల నగరం గా పేర్కొంటున్నారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లు లభ్యం అవుతుంటాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్లోని మాల్డా నగరం మామిడిపళ్ళకు ప్రసిద్ధి. ఇక్కడ పండే పండ్లు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగా చెందినవి. అందుకే మాల్డా నగరాన్ని మ్యాంగో క్యాపిటల్ అని పిలుస్తారు. ప్రతి వేసవి కాలంలో ఈ ప్రాంతం మొత్తం మామిడిపండ్ల సువాసనలతో నిండిపోతుంది. ఈ ప్రాంతంలో 30 వేల హెక్టార్లలో మామిడి పండ్లను పండిస్తున్నారు. ఈ పండ్ల పెంపకంతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. అయితే ఇక్కడ ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయి. వీటిలో హింసాగర్ ఒకటి. ఇది చాలా తీపిగా ఉంటుంది. అలాగే లాంగ్రా, ఫజ్లి, లక్ష్మణ్ బోగ్ వంటివి ఉన్నాయి.
ఇక్కడ ఈ మామిడి తోటలు కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యాటకంగా కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మహానంద నది ఒడ్డున ఉన్న ఈ జిల్లా అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మాల్దా నగరం పురాతనమైంది. ఒకప్పుడు దకిల్ దర్వాజా, ఫిరోజ్ మీనార్, ఎక్లాకి సమాధి వంటి ఆకట్టుకునే స్మారక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా పట్టు, జనపనార, పత్తి వంటి పరిశ్రమలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ నగరాన్ని ఏడాది పొడవునా సందర్శించవచ్చు. అయితే మే, జూన్ లలో ఇక్కడికి వస్తే రుచికరమైన మామిడి పండ్లను పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపాలంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు అనువైన నెలలుగా ఉంటాయి.
ఈ ప్రదేశానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. బాగ్డోగ్రా విమానాశ్రయానికి ప్రధాన నగరాల నుంచి చేరుకోవచ్చు. అక్కడి నుంచి టాక్సీలు, బస్సుల ద్వారా ఈ మామిడి నగరానికి వెళ్ళవచ్చు. అలాగే రైలు ద్వారా వెళ్లాలని అనుకునేవారు మాల్డా రైల్వే స్టేషన్ కు వెళ్లవచ్చు. రోడ్డు ద్వారా కోల్కతా నుంచి ఈ నగరానికి అనువైన రహదారి ఉంటుంది..మాల్డా నగరంలో పండిన మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తారు. అలాగే కోల్కత్తా, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు భారీగా సరఫరా అవుతూ ఉంటాయి.
