KTR, Manchu Manoj : సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యచేసినట్టుగా అనుమానిస్తున్న నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారిపై దారుణ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత రాజు శవమై తేలాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో నిందితుడిగా భావిస్తున్న రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి ఆత్మహత్యపై తెలంగాణ మంత్రి కేటీఆర్, సినీనటుడు మంచు మనోజ్ స్పందించారు.
చిన్నారి దారుణం తర్వాత నుంచి రాజు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో.. అతడిని పట్టుకునేందుకు వెయ్యి మంది పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. హైదరాబాద్ సహా.. హైవేలను గాలించారు. రాజు స్వగ్రామంతోపాటు సమీప బంధువుల గ్రామాల్లోనూ జల్లెడ పట్టారు. దీంతో.. రాజు ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు హైదరాబాద్ పోలీసులు.
ఈ విధంగా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్న తరుణంలో.. ఎవ్వరూ ఊహించని విధంగా నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై మృతదేహం ఉందనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం చేతిపై ‘మౌనిక’ అనే పచ్చబొట్టు ఉండడంతో.. మృతదేహం రాజుదేనని నిర్ధారించుకున్నారు.
దీనిపై మంత్రి కేటీఆర్ అధికారికంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘చిన్నారిపై అత్యాచారం చేసిన మృగాన్ని స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై కనుగొన్నారు. తెలంగాణ డీజీపీ ఈ విషయాన్ని ఇప్పుడే తెలియజేశారు.’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ ను రీట్వీట్ చేసిన సినీ నటుడు మంచు మనోజ్.. ‘‘ఈ వార్త తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్.. దేవుడు ఉన్నాడు. ఓం శాంతి చైత్ర’’ అని ట్వీట్ చేశారు.
నిందితుడు రాజు ఆత్మహత్యపై ట్విట్టర్ లో చిరంజీవి స్పందించాడు. ‘అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతోపాటు అందరికీ కొంత ఊరట.. ఈ సంఘటనపై మీడియా, పౌరసమాజం గొప్పగా స్పందించాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంతోపాటు, పౌరసమాజం కూడా చొరవచూపాలి. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
https://twitter.com/HeroManoj1/status/1438377240480256003?s=20