Homeజాతీయ వార్తలుKonijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ఆయన ప్రస్థానం..!

Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇకలేరు.. ఆయన ప్రస్థానం..!

Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) ఇకలేరు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఈరోజు ఉదయం రోశయ్యకు బీపీ తగ్గి పల్స్ పడిపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన ఆస్పత్రికి వచ్చేలోపే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదచాయలు నెలకొన్నాయి.

Konijeti Rosaiah
Konijeti Rosaiah

రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

రోశయ్య భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి నుంచి అమీర్‌పేటలోని ఆయన స్వగృహానికి తరలించారు. రోశయ్య మృతిచెందారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో దావనంలా వ్యాపించింది. ఆయన మృతిని కాంగ్రెస్ నేతలతోపాటు ఆయనతో కలిసి పనిచేసిన నేతలు, రాజకీయ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారంతా ఆయన ఇంటికి చేరుకొని రోశయ్యకు నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. రోశయ్య అంత్యక్రియలు రేపు మహాప్రస్థానంలో జరగనున్నాయి.

సుదీర్ఘ రాజకీయాల్లో ప్రస్థానం..

కొణిజేటి రోశయ్య రాజకీయాల్లో చాలా సీనియర్. ఉమ్మడి ఆంధప్రదేశ్ సీఎంగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పని చేశారు. రాజకీయాల్లో మంచివక్తగా పేరుతెచ్చుకున్న రోశయ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య కొన్నినెలలపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు.

కీలక పదవులు..

రోశయ్య 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఉన్నారు. 1989, 2004 ఎన్నికల్లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో తొలిసారిగా రోశయ్య రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. 1979లో టంగుటూరి అంజయ్య హయాంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలను నిర్వహించారు. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో హోం శాఖ మంత్రిగా పని చేశారు.

1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్ శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అనుహ్యంగా వరించిన సీఎం పదవీ..

రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ దుర్మరణం చెందారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యకు సీఎంగా బాధ్యతలను అప్పజెప్పింది. 3 సెప్టెంబరు 2009 నుంచి 24 నవంబరు 2010వరకు ఉమ్మడి ఆంధప్రదేశ్ సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత 2011లో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను 15సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకు ఉంది. 1995-97లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు.

Also Read: చిరంజీవిని రాజకీయాల్లోకి తెచ్చి.. వైఎస్ఆర్, చంద్రబాబులకు కుడిభుజంగా మారి.. రోశయ్య ప్రస్థానం

బాల్యం.. విద్యాభ్యాసం..

1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో కొణిజేటి రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితోబాటు రాజకీయ పాఠాలు నేర్చారు. గుంటూరు జిల్లాతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రోశయ్య లాంటి సీనియర్ నేతను కాంగ్రెస్ పార్టీ కోల్పోవడంతో ఆపార్టీలో విషాదాయలు నెలకొన్నాయి.

Also Read: కేంద్రపథకాలు.. జగనన్న పేర్లు..ఏంటిది?

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular