కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. ఈ నెల మూడో వారం నుంచి పున: ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. పలు రవాణా వ్యవస్థలకు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో త్వరలోనే వీటి రాకపోకలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం రూట్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉండగా.. మూడు బోగీలు గల మెట్రో రైలులో దాదాపు వెయ్యి మంది దాకా ప్రయాణం చేయవచ్చు. అయితే, కోవిడ్-19 నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున 50-60 శాతం ప్రయాణికులతోనే నడవనున్నాయి. ఒక్కో రైలులో 500 నుంచి 600మందిని మాత్రమే అనుమతించనున్నారు.
బోగీల్లో భౌతిక దూరం పాటించేలా తెల్లటి రౌండ్ సర్కిల్స్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల బటన్లను చేతితో తాకే అవసరం లేకుండా కాలివేళ్లతో టచ్ చేస్తే పనిచేసే ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని యోచిస్తున్నారు. బోగీల్లో ప్రయాణికులు పట్టుకొని నిల్చునే హ్యాండిల్స్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు.