Top 50 Hottest Cities In The World: సరిగ్గా మూడు రోజులక్రితం ఉత్తర ప్రదేశ్ లో 46కు మించిన డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సీజన్ లో ఇదే హైయెస్ట్ రికార్డు అనుకుంటే.. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో టెంపరేచర్ రికార్డు అవుతోంది. భయటికి వెళ్లాలంటేనే భయం కలుగుతోంది. ఒకవేళ బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామా అనే ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ఎండలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి. ఎండలు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నరకం చూస్తున్నారు. డీ హైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాలలో తీవ్రమైన అనారోగ్యానికి కూడా గురవుతున్నారు.
శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా సగటున 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు వడగాలులు కూడా తీవ్రంగా వీచాయి. వడదెబ్బ మరణాలు కూడా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ హీట్ నగరాలు కూడా మనదగ్గర నమోదయ్యాయంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వడగాలుల వల్ల శుక్రవారం మధ్యాహ్నం వరకే 40 డిగ్రీలకు మించి టెంపరేచర్ రికార్డయింది.
ఒడిశాలోని బాలన్ గిర్ ప్రాంతంలో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ట్రాకర్ ఈ విషయాన్ని బయట పెట్టింది. చంద్రాపూర్(మహారాష్ట్ర), ప్రయాగ్ రాజ్(ఉత్తరప్రదేశ్), ఛత్తీస్ గఢ్, బిహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదయింది. టాప్ 50 నగరాలలో సగం ఉత్తర ప్రదేశ్ లోనే ఉన్నాయి. ఇప్పటికే వాయవ్య, మధ్యభారత్ ప్రాంతంలో వడగాలులు చుక్కలు చూపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేసింది.
శుక్రవారం మధ్యాహ్నంవరకు వాతావరణ శాఖ విడుదల చేసిన వరల్డ్ హాట్50 నగరాలలో అన్ని కూడా మనదేశంలోనే ఉన్నాయి. వేడి మాత్రమే కాదు, వడగాలుల తీవ్రత మనదగ్గర అధికంగా ఉంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, పారిశ్రామీకకరణ, చెట్లను నరకడం వంటి పరిణామాలు ఎండ వేడిమి పెరగడానికి దోహదం చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
