India Crude Oil Strategy Plan V: కళ్లు ఉంటే మనం ముందు మాత్రమే చూడగలం. దిమాక్ ఉంటే మాత్రం దునియా మొత్తం చూడగలం. మిగతావాళ్లు చూడలేనిది కూడా దర్జాగా చూడగలం. ఇప్పుడు భారత్ కూడా అదే చేసింది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం, ఇతర పరిణామాలతో క్రూడ్ ఆయిల్ సరఫరా లేక ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఏకంగా కోతలు విధించాయి. చమురు ధరలను పెంచేశాయి. దేశాల అధినేతలు ఖర్చులు కూడా తగ్గించుకున్నారు. ఇందులో భారత్ కూడా ఉంది.
గల్ప్ దేశాలలో క్రూడ్ ఆయిల్ విరివిగా దొరుకుతుంది. రష్యా, ఇతర దేశాలలో క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. కానీ, అమెరికా అంక్షల వల్ల రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ కొనుగోలు చేసినా పరిమిత స్థాయిలోనే చేయాలి. దీంతో ప్రపంచ దేశాలు తమ అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నాయి. తట్టుకోలేక ధరలు పెంచుతున్నాయి. ధరల వల్ల ద్రవ్యోల్భణం అదుపుతప్పుతోంది. దీనికి భారత్ కూడా మినహాయింపు కాదు. ఈనేపథ్యంలో క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. ప్లాన్ ఏ, బీతో పాటు ప్లాన్ వీ అమలు చేసింది. వీ అంటే వెనిజులా అని అర్థం.
మనకు సౌదీ అరేబియా, అమెరికా, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ లభిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో వెనిజులా కూడా చేరింది. పైగా ఇక్కడి నుంచి మనకు చౌక ధరలోక్రూడ్ ఆయిల్ లభిస్తోంది. వెనిజులా నుంచి మనకు ప్రతిరోజూ 4,17,000 బ్యారెళ్ల చమురు వస్తోంది. ఏప్రిల్ నెలలో 2,83,000 బ్యారెళ్ల చమురు వెనిజులా నుంచి వచ్చింది. రష్యా, యూఏఈ వంటి దేశాలు మనకు చమురు ఎగుమతి చేస్తున్నవాటిల్లో ముందు వరుసలో ఉన్నాయి.
హర్ముజ్ లో నిత్యం అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. దీంతో వెనిజులా మీద మనదేశ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఆధారపడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ కొనుగోలులో రిలయన్స్ ముందు వరుసలో ఉంది. వెనిజులా ఉత్పత్తి చేసే క్రూడ్ ఆయిల్ లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. అది జామ్ నగర్ లోని రిలయన్స్ రిఫైనరీకి నూటికి నూరుశాతం సరిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వరంగంలో ఉన్నరిఫైనరీలు వెనిజులా క్రూడ్ ఆయిల్ ను ఒక పరిమాణంలో మాత్రమే శుద్ధి చేస్తాయని తెలుస్తోంది. రిలయన్స్ రిఫైనరీ వద్ద అత్యాధునిక సామర్థ్యంతో పని చేసే యంత్రాలున్నాయి.
