
మహారాష్ట్ర నుండి తెలంగాణ వైపు దూసుకువస్తున్న మిడతల దండుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మిడతల దండు రాష్ర్టానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్యారు.
పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. ఈ కీటకాల గుంపు తెలంగాణవైపునకే దూసుకొచ్చే అవకాశాలుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్దిరోజులుగా పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వాటి దారిలో కనిపించే ప్రతీ చెట్టూ చేమను తినేసే ఈ మిడుతలను మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే రెండుమూడు రోజుల్లో మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముంది. ప్రస్తుతం 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోకి చేరుకుంది.
దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, కామారెడ్డి, అసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్ బీ జనార్దన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రామ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఒక మిడతల దండు రోజులో దాదాపు 35000 మందికి సరిపోయే ఆహారాన్ని తినేస్తాయని నిపుణులు చెప్తున్నారు.