టీడీపీ మాజీ మంత్రి ‘అచ్చెన్నాయుడు’ ఔట్ పోయాడు.. మరో టీడీపీ నేత కొల్లు రవీంధ్ర ఏకంగా హత్య కేసులో ఇరుక్కుపోయాడు. జగన్ ను ఎదురించిన జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకెళ్లిపోయి ఈ మధ్య రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు నెక్ట్స్ చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమ కూడా బుక్కైనట్టేనని అందరూ భావించారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.
ఒక మొక్కకు అంటుగట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు.. ఓ పద్ధతిగా తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రులను బుక్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఏపీ సీఎంగా గద్దెనెక్కాక పూర్తిగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి వారికి దగ్గరయ్యారు జగన్.. ఏడాది పూర్తికాగానే ప్రతీకారం మొదలుపెట్టాడన్న విమర్శ టీడీపీలో ఉంది.. ఓ వైపు సంక్షేమ పథకాలతో తన స్థానాన్ని ప్రజల్లో సుస్తిరం చేసుకుంటూనే మరోవైపు టీడీపీ పునాదులు కూల్చేపనిలో జగన్ బిజీగా ఉన్నాడు.అయితే బీసీ, రెడ్డి సహా ఇతర సామాజిక వర్గాల నేతలను టార్గెట్ చేస్తున్న జగన్ ఒక కమ్మ సామాజికవర్గ నేతలను మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నట్టుగా అమరావతి రాజకీయవర్గాల్లో ఒక ప్రచారం నడుస్తోంది.
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో బుక్ చేసిన సీఎం జగన్ సర్కార్.. ఆయనకు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉంచింది. ఇక అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డిని కటకటాల పాలు చేసింది. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్ట్ చేసింది. అచ్చెన్న, జేసీ, కొల్లు రవీంద్రలలో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి సామాజికవర్గం. వీరి తర్వాత టీడీపీలో ఎవరు టార్గెట్ అని ఎదురుచూస్తున్న వేళ.. వైసీపీ సర్కార్ కు తాజాగా ఓ లూప్ హోల్ దొరికిందట.. పార్ట్ 1ను దిగ్విజయంగా ముగించిన సీఎం జగన్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో తనపై ఒంటికాలిపై లేచే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమను బుక్ చేశాడు.
ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో దేవినేని ఉమ ఓ వీడియోను ప్రదర్శించాడు. తిరుపతిలో ఉండటానికి ప్రజలు ఇష్టపడరని జగన్ ఓ సందర్భంలో అన్న మాటలను దేవినేని ఉమ ప్రదర్శించారు. అయితే అవి మార్ఫింగ్ అంటూ కర్నూలులో ఓ వైసీపీ కార్యకర్త సీఐడీకి ఫిర్యాదు చేశాడు.
దీంతో ఎక్కడ దొరుకుతాడని కాచుకు కూర్చున్న వైసీపీ సర్కార్ సీఐడీకి ఫిర్యాదు చేయడం ఆలస్యం.. ఆగమేఘాలపై కేసు నమోదు చేసి దేవినేని ఉమకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దేవినేనిపై పెట్టిన కేసుల్లో నాన్ బెయిలబుల్ ఉండడంతో అరెస్ట్ కోసమే పోలీసులు ఇలా చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానించారు.
రెండు సార్లు విచారణకు రావాలని సీఐడీ అధికారులు దేవినేని ఉమకు నోటీసులు పంపారు. అయితే ఉమ హాజరు కాలేదు. ఇంటికెళ్లి మరీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన ఇంటిలో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో దేవినేని ఉమ హైకోర్టు క్వాష్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. విచారణకు హాజరవ్వాలని దేవినేని ఉమను ఆదేశించింది. అయితే దేవినేనిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఆదేశాలివ్వడం విశేషం. దేవినేని ఉమకు 41ఏ కింద రక్షణ కల్పించాలని.. మే 7వ తేది వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో దేవినేని ఉమను అరెస్ట్ చేసే అవకాశం జగన్ సర్కార్ కు లేకుండా పోయింది.
ఇప్పటికే ముగ్గురు టీడీపీ నేతలు జైలుపాలయ్యారు. ఇప్పుడు దేవినేని కూడా బుక్ అయితే టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు సహా టీడీపీ మంత్రులంతా ఇప్పుడు చట్టం నుంచి రక్షణ పొందుతున్నారు. హైకోర్టుకు ఎక్కడం బెయిల్ లు, పిటీషన్లు రద్దు చేసుకోవడం జరిగిపోతోంది.
నిజానికి ఇప్పుడే కాదు.. అమరావతి పరిధిలోని ఇతర కమ్మ సామాజికవర్గానికి చెందిన వారి విషయంలో చట్టం కూడా ఏమి చేయలేదా ? అన్న విమర్శలను వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్నారు. వీరిపై సుప్రీంకోర్టుకు కూడా ఎక్కుతున్నారు.
ఇక జగన్ సర్కార్ కూడా బలమైన కమ్మ సామాజికవర్గంపై చర్యలకు వెనుకాడుతోందన్న విమర్శ తెచ్చుకుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం కరోనా ఆస్పత్రిలో రోగులు చనిపోతే చివరిదాకా ఆ ఆస్పత్రి యజమాని, కమ్మ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ ను వెంటాడిన జగన్ సర్కార్.. ఆయన హైకోర్టుకెళ్లి అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకున్నాక చర్యలు తీసుకోకుండా గమ్మునుంది. ఇప్పటికీ ఆ కేసు ఏమైందనే దానిపై స్పష్టత లేదు.
అమరావతి పరిధిలో కొడాలి నాని లాంటి బలమైన కమ్మ మంత్రులు, నేతలు వైసీపీకే అండగా ఉన్నారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారంతా జగన్ కే జైకొట్టారు. వారి ఒత్తిడితోనే జగన్ సైతం ఈ టీడీపీ కమ్మ నేతలపై చర్యలకు వెనుకాడుతున్నాడా? అన్న ప్రచారం కూడా అమరావతి సర్కిల్స్ లో సాగుతోంది. మరి దీనికి వైసీపీ నేతలు సమాధానం ఇస్తారా? ఆ నేతల విషయంలో చూసి చూడనట్టుగానే ఉంటారా? అన్నది వేచిచూడాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Cm jagans silence on kamma community
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com