BJP Southern States: భారతీయ జనతా పార్టీకి ఒక టెన్షన్ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే.. 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. అందులో మెజారిటీ రాష్ట్రాలు బిజెపి చేతుల్లోనే ఉన్నాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి చోటు దక్కడం లేదు. దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలు ఉంటే.. అందులో నాలుగు చోట్ల కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. బిజెపి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న వర్కౌట్ కావడం లేదు. నిన్ననే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల లో భాగంగా.. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్.. తమిళనాడులో కాంగ్రెస్ సహకారంతో విజయ్ అధికారంలోకి వచ్చారు. ఈ రెండు చోట్ల బీజేపీ నామమాత్రంగానే మిగిలింది. ప్రస్తుతం బిజెపికి ఏకైక ఉపశమనం ఏపీ. ఆపై తెలంగాణలో సీట్లతో పాటు ఓట్ల పరంగా ముందంజలో ఉంది.
* మొన్నటి గెలుపులో తెలుగు రాష్ట్రాలు..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు ఆదుకున్నాయి ఎన్డీఏను. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు అండగా నిలిచాయి. తెలంగాణలో బిజెపి ఒంటరిగానే 8 ఎంపీ సీట్లను దక్కించుకుంది. ఏపీలో ఒంటరిగా మూడు పార్లమెంట్ సీట్లు దక్కించుకోగా ఎన్డీఏ కూటమిపరంగా 21 సీట్లతో.. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు దోహదపడ్డాయి తెలుగు రాష్ట్రాలు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల నుంచి 100 పార్లమెంట్ సీట్లపై గురి పెట్టింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే నిన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. కూటమిపరంగా కూడా సీట్లు తక్కువే వచ్చాయి. దీంతో బిజెపిలో ఒక రకమైన టెన్షన్ నడుస్తోంది.
* భారీ అంచనాలతో..
దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. అటు తరువాత బలం పెంచుకుంది తెలంగాణలో మాత్రమే. ఏపీలో టిడిపి తో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సీట్లు, ఓట్లు పరంగా మెరుగుపడుతూ వచ్చింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం సీట్లు తక్కువయ్యాయి. అందుకే అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు 2029 సార్వత్రిక ఎన్నికల్లో.. దక్షిణాది నుంచి పట్టు నిలుపుకోవాలని భావించింది బిజెపి. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం అందుకు అనుకూలంగా లేవు. ముమ్మాటికి దీనిపై బిజెపి చాలా ఆందోళనతో ఉంది. ముందుగా తెలుగు రాష్ట్రాలపైనే ఆశలు పెట్టుకుంది.