రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలం తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టి వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారని స్పష్టం చేసింది. పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ 213, జీవోలపై హైకోర్టులో మొత్తం 13 వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆర్డినెన్స్, తదనంతర జీవోలపై దాఖలైన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం విచారించింది. కొద్ది రోజుల కిందట తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు ఈ రోజు వెల్లడించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు దురుద్దేశంతోనే జరిగిందని పిటీషనర్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తూ ఎస్.ఈ.సి నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. అనంతరం పరిణామాలలో తనకు ప్రాణహాని ఉందని నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. దీంతో ఏప్రిల్ 11న ఆర్డినెన్స్ తెచ్చిన ప్రభుత్వం ఎస్.ఈ.సి గా కనగరాజ్ నియామకాన్ని చేపట్టిన విషయం విదితమే.
హైకోర్టు తీర్పుతో మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా వచ్చానని నిమ్మగడ్డ తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటానని చెప్పారు.