Plastic Flexies Ban: ఏపీలో నేతలకు సరికొత్త చిక్కొచ్చి పడింది. ఎక్కడికక్కడే భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తామంటే కుదరదు. నేతల పుట్టిన రోజులు, వివాహ దినోత్సవాలు,పదవులు దక్కినా, పండుగలు వచ్చినా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసే సంస్కృతి అంతటా విస్తరించింది. పిల్లాడి బాలసార నుంచి పెద్దాయన పెద్దఖర్మ వరకూ ఇప్పుడు ఫ్లెక్సీల పర్వమే నడుస్తోంది. అయితే ఏపీ సర్కారు ఉన్నట్టుండి ఈ ప్టాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధించింది. ఈ మేరకు సీఎం జగన్ విశాఖలో శుక్రవారం ప్రకటించారు. పార్లే ఇండియా సంస్థ ఏర్పాటుచేసిన బ్లీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి సీఎం ప్రారంభించారు. అంతకు ముందు ఏయూ కన్వెన్సన్ హాల్ లో పార్లేజీ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్టాస్టిక్ నిషేధం విషయంలో కఠిన నిర్ణయాలు ప్రకటించారు. ఇక నుంచి నేతలెవరూ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టొద్దని సూచించారు. అవసరమైతే బట్టలపై, గుడ్డలపై చేతిరాతతో బ్యానర్లు చేసుకోవాలన్నారు. దీనిపై ప్రభుత్వం తరుపున స్పష్టమైన ఆదేశాలు జారీచేయనున్నట్టు ప్రకటించారు. అయితే సమావేశానికి హాజరైన అధికార పార్టీ నేతలు సీఎం నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. ఉన్నపలంగా ఇటువంటి నిర్ణయమేమిటని ఆశ్యర్యంవ్యక్తం చేశారు. ఇదంతా తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అని సీఎంపై రుసరుసలాడారు. అది సాధ్యమయ్యనా? అని ప్రశ్నిస్తున్నారు.
వాటిని వదిలేసి…
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించింది. ఆ జాబితాలో ఈయర్ బర్డ్స్, బెలూన్లు, కేండీలు,ఐస్ క్రీమ్ కు ఉపయోగించే ప్లాస్టిక్ పుల్లలు, కప్పులు, ప్లేట్లు, గ్లాసులు, ఫోర్కులు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీటు బాక్సులను చేర్చింది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని వినియోగించకూడదని ఆదేశాలు జారీచేసింది. ఒక వేళ వినియోగిస్తే కఠిన చర్యలకు ఉపక్రమించాలని ఆదేశాలిచ్చింది. అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.అయితే ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా వాటి వినియోగం మాత్రం తగ్గడం లేదు. ఎక్కడికక్కడే వీటి వినియోగం కనిపిస్తోంది. విక్రయాలు జరుగుతున్నాయి. కనీసం అధికారులు వీటిపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మాత్రం రాజకీయ నాయకులకు ఉపయోగపడే ఫ్లెక్సీలు, బ్యానర్లుపై మాత్రమే ప్రకటన చేయడం వారికి మింగుడు పడడం లేదు.
వృథా ప్రయాసంటున్న నాయకులు..
అయితే ఇప్పుడు బట్ట, గుడ్డలపై రాసేవారు లేరు. ఫ్లెక్సీలు, బ్యానర్లు రాక ముందు గుడ్డపై రాతలకు భలే డిమాండ్ ఉండేది. వివాహాలకు, నేతల ఆహ్వానానికి, విందులకు, అధికారిక కార్యక్రమాలకు గుడ్డ బ్యానర్లనే ఎక్కువగా వాడేవారు. అయితే ఇది వ్యయప్రయాసలతో కూడిన పని. ఎవరికైనా అవసరం అనుకుంటే రోజుల ముందు ఆర్డర్ చేసుకునేవారు. ఖర్చు కూడా ఎక్కువే. కానీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లు అందుబాటులోకి వచ్చిన తరువాత గంటల వ్యవధిలో అందుబాటులోకి వస్తున్నాయి. కార్యక్రమ నిర్వహణకు గంట ముందు ఆర్డర్ చేసుకున్నా ఇంటికి చేరుతున్నారు. పైగా గుడ్డ సంచుల బ్యానర్లతో పోల్చుకుంటే వీటికి నాణ్యతా ప్రమాణాలు కూడా ఎక్కువే. రకరకాలుగా, ఆకర్షణగా వీటిని తయారుచేసే లేటెస్ట్ సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. మనిషిని అందంగా చూపించగల రీతిలో ఫ్లెక్సీలు వచ్చాయి. అటు ఎన్నికల సమయంలో కూడా ఇవి ప్రధాన భూమిక వహిస్తూ వస్తున్నాయి. తమ అభిప్రాయాన్ని నేతలు ప్రజలకు తెలియజెప్పే సాధనంగా మారాయి. అటువంటి ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించడం మాత్రం నేతలకు మింగుడుపడడం లేదు.
ఇక ఏపీ సీఎం జగన్ లేడికి లేచిందే పరుగు అన్నట్టు సడెన్ గా ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తే ఎలా అని ఆ రంగంపై ఆధారపడిన వ్యాపారులు వాపోతున్నారు. ఆల్టర్ నేట్ లేకుండా ఎలా బంద్ చేస్తారని నిలదీస్తున్నారు. దీని వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడుతారని.. వారి ఉద్యోగ, ఉపాధి కోల్పోతారని వాపోతున్నారు. ఇప్పటికైనా జగన్ ఓ తీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More